NewsInn

News in a Click

ఓ ఆసుప‌త్రి – మూడు పార్టీల అనుబంధం

ఓ ఆసుప‌త్రి – మూడు పార్టీల అనుబంధం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఓ అత్యాధునిక ఆసుప‌త్రిని ప్రారంభించారు. సింధూ ఆసుప‌త్రి పేరుతో నిర్మాణం చేసిన ఈ ఆసుపత్రికి ప్ర‌ధాని ఎందుకు ప్రారంభించార‌న్న సందేహాలు అంద‌రిలోనూ వ్య‌క్తం అవుతాయి….. అది బీజేపీ నేత‌కు సంబంధించిన ఆసుప‌త్రి కావ‌చ్చ‌నే అభిప్రాయానికి చాలా మంది వ‌చ్చి ఉంటారు. కానీ ఆ ఆసుప‌త్రి వెనుక పెద్ద క‌థే న‌డిచింది. న‌గ‌రంలోని అత్యంత విలాస‌వంత‌మైన ప్రాంతానికి అత్యంత స‌మీపంలో ఉన్న ఈ ఆసుప‌త్రి గురించి న్యూస్ ఇన్ అందిస్తున్న స్పెష‌ల్ స్టోరీ….ఈ ఆసుప‌త్రి ఓ పారిశ్రామిక వేత్త‌దే…..ఎలాంటి సందేహం లేదు. పారిశ్రామ‌క వేత్త‌లంటే ఏ పార్టీకి దూరంగా ఉంటారు. అన్ని పార్టీలతో అంతే స‌న్నిహితంగా బ‌డా పారిశ్రామిక వెత్త‌లు ఉంటారన‌డంలో ఎవ‌రికి అనుమానం లేదు. ఇక్క‌డ అదే జ‌రిగింది. ఆసుప‌త్రి నిర్మాణానికి భూమి ఓ ప్ర‌భుత్వం కేటాయించింది. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న ప్ర‌ధాన‌ పార్టీ ఈ భూ కేటాయింపును వ్య‌తిరేకించింది. భూ కేటాయింపుపై కోర్టుకు వెళ్లింది. బీఆర్ ఎస్ స‌ర్కార్ కేటాయించిన భూ కేటాయింపును లీజు నిబంద‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని, దీన్ని పునః ప‌రిశీలించాల‌ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల‌తో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత మేం అధికారంలోకి భూ కేటాయింపు ర‌ద్దు చేస్తామ‌ని, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ వారిని జైల్లో పెడుతామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అభ్యంత‌రం లేవ‌నెత్తిన పార్టీ రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకుంది….భూ వివాదం సానుకూలంగా ప‌రిష్కారం అయింది.

కోర్టు ప‌రిశీలించ‌మ‌ని చెప్ప‌డంతో అధికార పార్టీ ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో ప‌రిశీలించి నిర్మాణం స‌గానికి పైగా పూర్త‌యింది కాబ‌ట్టి ఇక లీజు ఖ‌రారు చేయ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయానికి వ‌చ్చి నిర్ణ‌యం తీసుకుంది.ఇక ఆసుప‌త్రి నిర్మాణం చేస్తున్న బ‌డా పారిశ్రామిక వేత్త‌కు స్థానికంగా ఉన్న అభ్యంత‌రాల‌న్నీ తొల‌గి పోయాయి. అత్యాధునిక సాంకేతిక‌త‌ను అంద‌బాటులోకి తెచ్చారు. ఇక మ‌రో పార్టీని కూడా ఈ ఆసుప‌త్రిలో ఆ పారిశ్రామిక వేత్త, రాజ‌కీయ నేత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఇందులో భాగ‌స్వామ్యం అయ్యేలా చేశారు. దాదాపు గా ఈ ఆసుప‌త్రి నిర్మాణంపై ఓ అవ‌గాహ‌న దాదాపు రాజ‌కీయాల్లో ఉన్న వారంద‌రికీ వ‌చ్చి ఉంటుంది. కాక‌పోయినా…. బ‌హిరంగ ర‌హ‌స్యాన్ని గుర్తు చేయ‌డం బాధ్య‌త‌గా భావిస్తున్నాం… రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో హెటిరో ఫార్మా అధినేత‌, బీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు పార్థ‌సార‌థి రెడ్డికి అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలో ప్ర‌భుత్వ భూమిని కేటాయించింది.

ఈ భూమి విలువ‌కు లీజుకు పొంత‌న లేని ధ‌ర‌నే నిర్ణ‌యించింది.ఈ భూమిలో పార్థ సార‌థి రెడ్డి త‌న కుమార్తె కృష్ణ సింధూరి జ్ఙాప‌కార్ధం హైటెక్ సిటీ స‌మీపంలో క్యాన్స‌ర్ ఆసుప‌త్రి నిర్మాణం చేశారు. ఈ భూ కేటాయింపు పై అప్ప‌టి కాంగ్రెస్ నేత ఇప్ప‌టి సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్ల‌డంతో పాటు అక్ర‌మాల‌కు పాల్ప‌డితే జైలుకు పంపిస్తా అన్న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఆ త‌రువాత అధికారంలోకి రావ‌డంతో నిర్మాణం పూర్త‌యినందున మ‌రోసారి లీజు ఖరారు చేస్తూ జీ.ఓ. నం. 37ను విడుద‌ల చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. బీఆర్ ఎస్ కేటాయించిన భూమిని కాంగ్రెస్ స‌ర్కార్ మ‌రింత ప‌క‌డ్భంధీగా అప్ప‌గించింది. ఇక్క‌డ నిర్మాణం చేసిన ఆసుప‌త్రిని ప్ర‌ధాని మోడీ ప్రారంభించారు. దీంతో బీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యులు అనుకున్న‌ట్లు అంతా స‌వ్యంగా పూర్త‌యింది.

పేద‌ల ఇళ్ల‌ను క‌నిక‌రం లేకుండా కూల్చి వేస్తున్న స‌ర్కార్…..కోర్టు ఆదేశించినా ప‌రిశీలించి మ‌రోసారి మ‌రింత ప‌క‌డ్భంధీగా నిర్ణ‌యం తీసుకుని వంద‌ల కోట్ల రుపాయాల విలువ చేసే భూమిని బ‌డా నేత‌కు అప్ప‌గించ‌డం ఇప్పుడు మ‌రోసారి హాట్ హాట్ గా మారింది. ఈ వ్య‌వ‌హారంలో అన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల ప్ర‌మేయం ఉండ‌డంతో భ‌విష్య‌త్తులో ఏ పార్టీ ఈ వ్య‌వ‌హారంపై నోరు మెదిపే అవ‌కాశం లేనే లేదు. ఎదైనా సంస్థ ముందుకు వ‌స్తే…అన్ని స‌వ్యంగానే ఉన్న‌ట్లు లీజు వ్య‌వ‌హారం పూర్త‌యింది కాబ‌ట్టి ఇక అధికారికంగా కూడా ఇబ్బందులు కూడా రానే రావు. ప్ర‌భుత్వ భూమిని లీజు తో ద‌క్కించుకున్న ఈ ఆసుప‌త్రి పేద‌ల‌కు ఏ మేర‌కు వైద్య సేవ‌లు అందిస్తుంద‌న్న‌ది ఇప్పుడు అంద‌రిలో మెదులుతున్న ప్ర‌శ్న‌గా మారింది.

ప్రధాని పర్యటనలు ఆర్థిక పాఠాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *