(హైదరాబాద్, న్యూస్ఇన్)
తెలంగాణా బీజేపీలో దూకుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ దూకుడుకు తనయుడు భగీరథ వ్యవహారం బ్రేకులు వేస్తోంది. గతంలో ఎలాంటి ఆరోపణలు బండి సంజయ్ పై లేకపోవడంతో…..ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తనదైన దూకుడుతో బీజేపీ నేతల్లో ఇమేజ్ పెంచుకోవడంతో పాటు ప్రజలకు చేరువయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించిన తీరుతో అప్పటి అధికార పార్టీ బీఆర్ ఎస్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గులాబీ పార్టీని కమలనాథుల్లో బండి సంజయ్ వెంటాడినట్లు ఏ నేత కూడా ఆ పార్టీపై విమర్శలు చేయలేదు. తొలిసారి ఎంపీ కావడం, ఆ తరువాత రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంతో మరింత దూకుడు పెంచారు. ముఖ్యంగా కేసీఆర్, కేటిఆర్ లను ఆయన చేసిన టార్గెట్ తో ప్రజల్లో కూడా మద్దతు కూడగట్టడంలో విజయవంతం అయ్యారు. బీజేపీ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి అప్పటి ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో తన మార్క్ వేసుకున్నారు.

క్లీన్ ఇమేజ్ పై మచ్చ….
మరోసారి కరీంగనర్ ఎంపీగా విజయంసాధించడంతో పార్టీలో ఉన్న పట్టు, నిబద్ధతను బీజేపీ హై కమాండ్ గుర్తించి కేంద్రంలో మంత్రి పదవి కట్టబెట్టింది. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ కు ఇప్పుడు సన్ స్ట్రోక్ భారీగానే తగిలింది.బండి దూకుడు తనయుడు భగీరథ్ వ్యవహారం బ్రేకులు వేసేలా మారింది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలను టార్గెట్ చేయడం బండికి అంత సులువు కూడా కాకపోవచ్చు. హిందుత్వ ఎజెండా, సనాతన ధర్మం అంటూ విరుచుకు పడే సంజయ్ కు మైనర్ బాలిక వ్యవహారంతో కొత్త చిక్కులు ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఇది రాజకీయ కుట్ర అని చెప్పారు. గతంలో బండి సంజయ్ తనయుడి వ్యవహారం వివాదాస్పదం అయిన సందర్భాలు ఉండడంతో దీన్ని రాజకీయ కుట్రగా సంజయ్ చెబుతున్నా…అది నమ్మశక్యంగా లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. మైనర్ బాలికతో బండి భగీరథ్ ఉన్న ఫోటోలు, చనువుగా ఉన్న వీడియోలు వెలుగు చూడడం సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. హనీ ట్రాప్ అని బండి భగీరథ్ ఫిర్యాదు చేసినా…. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ 17 ఏళ్ల అమ్మాయితో హనీట్రాప్ లో పడేంత అమాయకుడా భగీరథ్ అన్న చర్చలు జరుగుతున్నాయి.

సిట్ వేసిన సర్కార్…..
ఈ విషయంలో రాజకీయంగా ఇప్పటికిప్పుడు బండి సంజయ్ కు వచ్చేముప్పు లేకున్నా….. భవిష్యత్తులో మాత్రం భగీరథ బ్రేకులు వెంటాడే అవకాశాలుంటాయి. బండి కి ఏ బాధ్యతలు అప్పగించినా….భగీరథ వ్యవహారం తెలంగాణా రాజకీయాల్లో వెంటాడే అవకాశం ఉటుంది. బండి సంజయ్ కు ఇప్పటి వరకు ఉన్న క్లీన్ ఇమేజ్ కు ఇకపై భగీరథ్ మచ్చ తెచ్చేలానే మిగిలిపోనుంది.ఇక రాష్ట్ర ప్రభుత్వం భగీరథ కేసుపై దృష్టి పెట్టింది. సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.సిట్ ఇంచార్జ్ గా నియమించిన రితిరాజ్ మాట్లాడుతూ భగీరథను అరెస్టు చేస్తామని ప్రకటన కూడా చేశారు. దీంతో భగీరథ అరెస్టు తప్పదన్న సంకేతాలు సర్కార్ ఇచ్చినట్లయింది. ఈ ఘటనపై తెలంగాణా బాలల హక్కుల కమీషన్ కూడా స్పందించి వివరాలు అందించాలని ఆదేశించింది. మొత్తం మీద ఈ వ్యవహారం మరిన్ని రోజులు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే అవకాశం కనిపిస్తోంది. తద్వారా బండి ఇమేజ్ పై ప్రభావితం చూపే చాన్స్ కూడా కనిపిస్తోందసిట్ అధికారిగా ఓ మహిళా అధికారిని నియమించడంతో ఈ వ్యవహారంలో భగీరథ వ్యవహారంపై ఏ మేరకు స్పష్టత వస్తుందన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసులో ఎవరున్నా … వదిలి పెట్టేది లేదని ప్రకటిస్తున్నారు. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడే ఆరోపణలు ఎదుర్కొంటుండంతో బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు రాజకీయంగా వ్యక్తం అవుతున్నాయి.











Leave a Reply