NewsInn

News in a Click

పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంచాలి

పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంచాలి

(అమరావతి, న్యూస్ఇన్‌)

చమురు దిగుమతులపై భారం తగ్గేలా పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంచాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో ముఖ్యమంత్రి ఇవాళ ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని 40 శాతానికి పెంచేలా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇథనాల్ మిశ్రమం అత్యధిక స్థాయిలో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇథనాల్ మిశ్రమం పెరిగితే భారతదేశం పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని సీఎం వివరించారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి ఓ లేఖ రాసినట్టు సీఎం తెలిపారు. ఇథనాల్ మిశ్రమం పెంపు నిర్ణయాన్ని వేగంగా అమలు చేయాలని సీఎం కోరారు. కేంద్రం చేపట్టే ఈ చర్యల వల్ల చమురు దిగుమతులు తగ్గి దేశ ఇంధన భద్రత పెరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల రూ.1.1 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యిందని వివరించారు.

అలాగే 500 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయని స్పష్టం చేశారు. ఇథనాల్ తయారీ వల్ల చెరకు, మొక్క జొన్న రైతులకు అదనపు ఆదాయం కూడా చేకూరుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలియచేశారు. ఇప్పటికే రైతులకు రూ.87,558 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేశారు. ఏపీలో పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతున్న మొక్క జొన్న పంటకు కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని అన్నారు. మొక్క జొన్న ఇథనాల్ ఉత్పత్తిలో ముఖ్యమైన ముడి వనరు కావటంతో డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. క్వింటాలు మొక్క జొన్నకు కనీస మద్ధతు ధరగా రూ.2400 ను కేంద్రం నిర్ణయించినా ఆ ధరకు కొనుగోలు జరగకపోవటంతో బహిరంగ మార్కెట్ లో దీని ధర రూ.1700 నుంచి 1800కు పడిపోయిందని సీఎం వివరించారు. మొక్క జొన్న రైతుల ప్రయోజనాలు కాపాడేలా కేంద్రం త్వరితగతిన ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *