(హైదరాబాద్,న్యూస్ఇన్)
జాతీయ రాజకీయాల్లో బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అధ్వాన్నంగా ఉంటుందన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను ఉద్దేశ పూర్వకంగానే బీజేపీ అడ్డుకుందన్నారు. మధ్య ప్రదేశ్ లో మూడో రాజ్యసభ స్థానం దక్కించుకునేందుకు మీనాక్షి నటరాజన్ లాంటి నేత నామినేషన్ తిరస్కరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి మహిళా నేతలను అడ్డుకుని బీజేపీ రాజకీయాల్లో ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఇలాంటి విధానాలను అవలంభిస్తోందన్నారు. ఆమెకు సంబంధం లేని కేసుతో ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం దౌర్భగ్యం అని వాపోయారు. కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ చెబుతున్నట్లు ఓట్ చోరీతోనే బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.

పశ్చిమ బెంగాల్లో అన్ని స్థానాల్లో గెలవడం బీజేపీకి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అధికారం, ఎన్నికల కమీషన్ అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుందన్నారు. 12 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రధాని మోడీ కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ దొంగతనం చేస్తే….బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోందని, బీజేపీ చేసిన వ్యవహారాన్ని ఎందుకు తప్పబట్టడం లేదని ప్రశ్నించారు. తమ పై వస్తున్న ఆరోపణలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు అని చెబుతూ బీజేపీ మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై చర్చ జరుగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.










Leave a Reply