NewsInn

News in a Click

గంగా-కావేరి అనుసంధానం-భారత్ అన్ స్టాపబుల్

గంగా-కావేరి అనుసంధానం-భారత్ అన్ స్టాపబుల్

(న్యూస్ఇన్‌, బెంగుళూరు)

గంగా- కావేరి న‌దుల అనుసంధానంతో భార‌త్ అభివృద్ధి అన్ స్టాపబుల్ గా మారుతుందని ఏపీ సీఎం చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర ప్రాంత రైతుల ప్రయోజనాలపై చర్చించడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాలు వేరైనా దేశంగా మనమంతా ఒక్కటేనని, రైతుల సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల రైతులకు సాగునీటిని, ప్రజలకు తాగు నీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం చెప్పారు. 2024 ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టులో 19వ నెంబరు గేటు కొట్టుకుపోవటంతో తక్షణం స్పందించి స్టాప్ లాక్ గేట్ అమర్చామని అన్నారు. ప్రాజెక్టు మరమ్మతులో భాగంగా రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏపీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఈ గేట్ల ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. తుంగ భద్ర డ్యామ్ లోని సీఎం చంద్రబాబు 19వ నెంబరు గేటు, కర్ణాటక ముఖ్యమంత్రి 18వ గేటును, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ 17వ గేటును, అలాగే 20 గేటును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముందు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర ప్రాజెక్టు, జలాల వినియోగంపై సమావేశమయ్యారు. మూడు రాష్ట్రాల ప్రయోజనాలపై నలుగురు నేతలు విస్తృతంగా చర్చించారు.

నదుల అనుసంధానం అవసరం….

2024లో 19వ గేట్ కొట్టుకుపోయినప్పుడు స్టాప్‌ లాక్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టామని, ప్రస్తుతం 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించి ప్రాజెక్టును మరింత బలోపేతం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని వెల్లడించారు. ‘తుంగభద్ర నది చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గుర్తుచేశారు. విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి తుంగభద్ర నది సహజ రక్షణ కవచంగా నిలిచిందన్నారు. జోగులాంబ ఆలయం, హంపీ విరూపాక్ష ఆలయం, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వంటి పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరానే వెలిశాయని సీఎం పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం నదుల అనుసంధానం అత్యంత అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. కెన్–బేత్వా ప్రాజెక్టు ద్వారా ఉత్తర భారతదేశంలో నదుల అనుసంధానం విజయవంతంగా అమలవుతోందని, అదే తరహాలో గోదావరి–కావేరి అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయని సీఎం చంద్రబాబు అన్నారు. 1983లో ప్రధానితో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు 5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారని, ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర అంగీకారంతో చెన్నైకి 15 టీఎంసీల తాగు నీటిని అందించామని గుర్తు చేశారు. గంగా- కావేరీ నదుల అనుసంధానం జరిగితే భారత్ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

పొదుపుగా వినియోగించాలి…

ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా రాష్ట్రాలు అంతర్గతంగా నదుల అనుసంధానం చేపట్టి, ఆ తర్వాత రాష్ట్రాల మధ్య అనుసంధానానికి అడుగులు వేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే అన్ని ప్రభుత్వాల ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య జరిగిన ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. అంతా కలిసి రైతుల ప్రయోజనాలను కాపాడుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టులను పరిరక్షించుకుంటే దేశాభివృద్ధికి అవి కీలకం అవుతాయని అన్నారు. ఈ సమావేశానికి ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తెలంగాణా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మూడు రాష్ట్రాల స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *