(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సరికొత్త పోరాటానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 9 జిల్లా బిజెపి నూతన కార్యాలయాల (రంగారెడ్డి రూరల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, వనపర్తి, నాగర్కర్నూల్) ప్రారంభోత్సవం చేశారు. కొత్తగా ప్రారంభించుకున్న బిజెపి జిల్లా కార్యాలయాలు పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే ‘సంకల్ప కేంద్రాలు’, ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాలని స్పష్టం చేశారు. “నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్” అనే నినాదంతో పనిచేసే బిజెపి కార్యకర్తలకు ఈ కార్యాలయాలు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయన్నారు.
ఈ చారిత్రాత్మక వేదికపై దేశ ఏకీకరణకు కృషి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు , పార్లమెంట్లో తెలంగాణ కోసం బలంగా స్వరం వినిపించిన దివంగత నేత సుష్మా స్వరాజ్ కు నివాళులు అర్పించారు. తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లయినా అమరవీరులు కలలుగన్న స్వప్నం ఇంకా పూర్తిగా నెరవేరలేదని, ఆ ఆశయాలను సాకారం చేయాల్సిన బాధ్యత బిజెపిపైన ఉందన్నారు. కొందరు బిజెపిని బయటి పార్టీ అని విమర్శిస్తుంటారని మండిపడుతూ.. 1984లో దేశవ్యాప్తంగా పార్టీకి కేవలం ఇద్దరే ఎంపీలు ఉంటే, అందులో ఒకరు తెలంగాణ గడ్డ నుంచే గెలిచారనే చారిత్రాత్మక సత్యం అని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో కష్టాలు, పోలీస్ లాఠీదెబ్బలు, పోరాటాలు ప్రాణత్యాగాలతో తెలంగాణ లో పార్టీ నిలబెడుతున్నారని చెప్పారు.

కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల అవకాశవాద రాజకీయాలపై నితిన్ నబిన్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రాన్ని కేవలం అధికారాన్ని అనుభవించే సాధనంగా మార్చుకున్న పాలకులను గద్దెదించే శక్తి ఒక్క బిజెపి కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై బిజెపి కార్యకర్తలు పోరాడితే, ఆ పోరాట ఫలాన్ని కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా పొందిందని విమర్శించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థానికే ప్రాధాన్యత ఇచ్చే చరిత్ర కాంగ్రెస్దని, పాలనలో ఘోరంగా విఫలమైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పోరాటాల ద్వారా గద్దెదించేందుకు కార్యకర్తలు గ్రామ గ్రామాన, వీధి వీధినా కదలాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నో హింసలు, అరాచకాలను ఎదుర్కొని, పోరాటాలతో అక్కడ కమలం ఎలా వికసించిందో, తెలంగాణలో కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనలో దేశంలోని 140 కోట్ల భారతీయులు ఏకతాటిపై నడుస్తున్నారని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలలుగన్న “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్”, పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ మరియు అటల్ బిహారీ వాజ్పేయి చూపిన సుశాసన లక్ష్యాలను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తోందని కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా, అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే సంకల్పంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలని, కేంద్ర నిధులతో తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పడితేనే సంపూర్ణ ప్రగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బిజెపి కార్యకర్తలకు ఒక కొత్త పోరాటానికి నాంది అని, ప్రతి ఒక్కరూ సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో పోరాడి మున్సిపల్ ఎన్నికల్లో కమలాన్ని వికసింపజేయాలని పిలుపునిచ్చారు. 1980లో స్థాపించబడిన బిజెపి నేడు దేశంలోని 22 రాష్ట్రాలలో అధికారంలో ఉంటూ నిరంతరం ఎదుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు.












Leave a Reply