రాష్ట్రంలో Gen-Z ను ఆకట్టుకునే ప్రణాళికలను బీజేపీ అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పర్యటన ప్రధానంగా యువత చుట్టే ఎక్కువగా తిరిగింది. రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించిన ఆయన రాష్ట్ర పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలన్న సూచనలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు నేతృత్వంలో జాతీయ అద్యక్షుడితో మూడు రోజుల ప్రజా కార్యక్రమాలను నిర్వహించి కార్యకర్తల్లో నూతన జోష్ నింపింది తెలంగాణ బీజేపీ. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నితీన్ నబీన్ తొలిరోజు పర్యటనలో ప్రకటన చేసారు.
మొదటి రోజు తెలంగాణ ప్రజలనుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు బీజేపీ జాతీయ అద్యక్షుడు. తెలంగాణ ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని పేర్కొంటూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని మొదటి నుంచి చివరి వరకు ఎదిరించి పోరాడింది భారతీయ జనతా పార్టీయేనని స్పష్టం చేసారు. కొన్ని ప్రత్యేక కారణాల వలన ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు, కాంగ్రెస్ అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బిజెపిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ఇంటింటికీ వెళ్ళాలని, ప్రజలతో మమేకమవుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రతి బీజేపీ కార్యకర్త 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సన్నద్ధం కావాలని నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఓటరునూ సంప్రదించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని చెప్పారు. కేంద్ర పథకాల లబ్థిదారులందరినీ కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవాలని, సమాజంలోని ప్రతి వర్గంతో అనుబంధం పెంచుకోవాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. త్వరలో జీహెచ్ఎంసీతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. భాగ్యనగరాన్ని సరైన దిశలో నడిపించగలిగేది, ప్రజల ఆశలను నెరవేర్చగలిగేది బీజేపీ మాత్రమే. భాగ్యనగర భవిష్యత్తును మార్చాలంటే మనం ప్రజల మధ్యకు మరింత బలంగా వెళ్లాలి అని నితీన్ నబీన్ స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుతో పోటీ చేసే ప్రతి అభ్యర్థినీ గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో గత (కేసీఆర్) సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుందని, మేడిగడ్డ పేరుతో ప్రజల సొమ్ము నీళ్లపాలు చేసిందని నితిన్ నబీన్ ఆరోపించారు. ప్రజల కష్టార్జితాన్ని భారీగా దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. అవినీతిపరుల నల్ల ముఖాన్ని తాము బయటికి తెస్తామని, కాళేశ్వరం దోషులకు శిక్ష పడేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయాన్ని ప్రారంభిస్తూ అదే సమయంలో ఒకేసారి రాష్ట్రంలోని 9 జిల్లా బిజెపి నూతన కార్యాలయాలను (రంగారెడ్డి రూరల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, వనపర్తి, నాగర్కర్నూల్) వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించుకున్న బిజెపి జిల్లా కార్యాలయాలు పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే ‘సంకల్ప కేంద్రాలు’, ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాలని స్పష్టం చేశారు. “నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్” అనే నినాదంతో పనిచేసే బిజెపి కార్యకర్తలకు ఈ కార్యాలయాలు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయని భరోసా వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ తరహాలోనే ఈసారి తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రెండవ రోజు వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్ క్లేవ్ లో విద్యార్థులతో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముచ్చటించారు. విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానం చెప్పారు నితిన్ నబీన్. ఇంత చిన్న వయసులో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చేప్పారు.నా తండ్రి మరణం తర్వాత అనుకోకుండా తాను రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయ జీవిత ప్రారంభ దశలో తాను కూడా ఎలా ముందుకు సాగాలి అనే సందేహాలను ఎదుర్కొన్నానన్నారు.కానీ కాలక్రమేణా తాను ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నానని, జీవితంలో షార్ట్కట్స్ అనేవి ఉండవు. జీవితం వేగాన్ని పరీక్షించే పోటీ కాదు. అది సహనాన్ని పరీక్షించే ప్రయాణం అన్నారు.తాను ఎలాంటి అసాధారణమైన పని చేయలేదని, ప్రత్యేకంగా ఏదీ చేయలేదని, కేవలం నిబద్ధతతో, నిజాయితీతో, నిరంతర కృషితో తన బాధ్యతలను నిర్వర్తించానన్నారు. ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమై, అధ్యక్షుడి స్థాయికి చేరిన తన ప్రయాణం తనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందన్నారు. మీరు మీ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తే, పార్టీ మీ కృషిని గుర్తించి సరైన స్థాయికి తీసుకెళ్తుందని, మీ ప్రత్యేకత పట్ల నమ్మకం కలిగి ఉండాలని, చాలాసార్లు సమాజ ఒత్తిడి వల్ల మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మీపై, మీరు ఎంచుకున్న మార్గంపై విశ్వాసం కలిగి ఉండటం అత్యంత ముఖ్యమని విద్యార్థులకు స్పర్తివంతమైన సందేశం ఇచ్చారు నితీన్ నబీన్.
ఇదే రెండో రోజు వరంగల్ లో గిరిజన నేతలనుద్దేశించి నితీన్ నబీన్ ప్రసంగించారు. తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అదే బిల్లులో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా చేర్చడంతో ఆ బిల్లు న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుందని, ఫలితంగా గిరిజనులకు అందాల్సిన 10 శాతం రిజర్వేషన్ అమలు ఆలస్యమైందన్నారు. దీని వల్ల గిరిజన విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ ఆలస్యంతో వారికి జరిగిన నష్టం ఎంత తీవ్రమైందో గిరిజన సమాజానికే బాగా తెలుసన్నారు నితీన్ నబీన్. గిరిజనుల సంక్షేమం గురించి నిజాయితీగా ఆలోచించి, వారిని అభివృద్ధి దిశగా నడిపించి, వారికి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమేనన్నారు నితీన్ నబీన్. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని, . చెంచు గిరిజన కుటుంబాలకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించారని, అదే విధంగా గిరిజన సహకార సంఘాల ద్వారా వారి అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు నితీన్ నబీన్.

నితీన్ నబీన్ పర్యటనలో చివరి రోజైన మూడో రోజు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో మార్పు ఢిల్లీ నుంచి రాదని, తెలంగాణ ప్రజలతో కలిసి పోరాడితేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రజలతో కలిసి నడుస్తూ, వారి ఆశయాలకు ప్రతినిధులుగా నిలబడితేనే తెలంగాణలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. జాతీయ నాయకత్వానికి బలం రాష్ట్ర నాయకత్వం నుంచి వస్తుందన్నారు. రాష్ట్ర నాయకత్వానికి బలం జిల్లా నాయకత్వం నుంచి లభిస్తుందని, జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వం బలంగా నిలుస్తుందని, మండల నాయకత్వానికి అసలైన శక్తి బూత్ స్థాయి నాయకత్వమేనన్నారు. అందుకే బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడం పార్టీ శ్రేణులందరి బాధ్యత అన్నరు నితీన్ నబీన్. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణను ప్రత్యేక మిషన్గా స్వీకరించిందని, ఆ మిషన్ను విజయవంతం చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యకర్తదేనన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ రాజకీయ లక్ష్యం మాత్రమే కాదని, ఎన్నో సంవత్సరాలుగా తమ కార్యకర్తలు నిస్వార్థంగా చేసిన త్యాగాలకు, పోరాటాలకు తగిన ఫలితం అందించడం కూడా తమ బాధ్యత అన్నరు నితిన్ నబీన్. తెలంగాణ ప్రజలు కన్న కలలను సాకారం చేసే తెలంగాణను నిర్మించడమే తమ సంకల్పమన్నారు. అందుకే కార్యకర్తలంతా ప్రతి ఇంటికీ వెళ్లాలని, ప్రధానమంత్రి మోదీ, తెలంగాణకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలని, అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజలకు స్పష్టంగా వివరించాలని పిలుపునిచ్చారు నితీన్ నబీన్. ఈ ప్రసంగంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు బీజేపీ జాతీయ అద్యక్షుడు నితీన్ నబీన్.
కృష్ణ హరి, సీనియర్ జర్నలిస్టు












Leave a Reply