(హైదరాబాద్,న్యూస్ఇన్)
నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యస్థీకరణపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, పరిధుల విభజన, పరిపాలనా అంశాలపై తమ ప్రతిపాదనలను పోలీస్ కమిషనర్లు డీజీపీకి వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల పరిధి, పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ హద్దులను నిర్ణయించాలని సూచించారు.భవిష్యత్ పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్వ్యవస్థీకరించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో సంబంధిత అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ ల పరిధుల మార్పులు , చేర్పుల నిర్ణయం వల్ల ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, ఆయా ప్రాంతాల భౌగోళిక, పరిపాలనా ప్రత్యేకతలను ప్రతిబింబించే విధంగా పోలీస్ స్టేషన్లకు తగిన పేర్లు నిర్ణయించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజాకేంద్రిత, సమర్థవంతమైన పోలీసింగ్ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత అందుబాటులోకి తెచ్చేవిగా ఉండాలన్నారు.













Leave a Reply