(హైదరాబాద్, న్యూస్ఇన్)
బినామి పేర్లతో ఓ పోలీసు అధికారి భారీగా అక్రమాస్తులు కూడ బెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏకకాంలో ఆ డిఎస్పీతో పాటు సమీప బంధువుల ఇళ్లపై ఏక కాలంలో దాడులు చేయడంతో అవినీతి అధికారి గుట్టు రట్టు అయింది. గతంలో డిఎస్పీగా పని చేసిన భీంరెడ్డి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బాధ్యతలు నిర్వహించారు. కీలక ప్రాంతాల్లో అవకాశం దక్కడాన్ని ఆ అధికారి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. నార్సింగ్ సమీపంలోని ఖరీదైన విల్లాలో నివాసం ఉంటున్న ఆయన ఇంటిపై దాడులు నిర్వహించి ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించారు. ఈ అస్తులన్నీ బినామి పేర్లతో భీంరెడ్డి వెనుకేసుకున్నారని ఏసీబీ గుర్తించింది. ఉదయం 5 గంటల నుంచి నిర్వహించిన సోదాల్లో కీలక డైరీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ డైరీలో 15 మంది బినామి పేర్లతో ఆస్తులు కూడగట్టినట్లు గుర్తించి వారి ఇళ్లలో కూడా సోదాలు చేయడంతో డిఎస్పీ భీంరెడ్డి అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు గమ్మాయి. ఆ అధికారి నివాసం ఉండే ఇంటి విలువ రూ. 8 కోట్లు ఉంటుందని అంటున్నారు. 15 మంది బినామిల పేర్లతో 16 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ తేల్చింది. ఈ అస్తుల అసలు విలువ, మార్కెట్ విలువలను ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. బెంగుళూరు లో ఒక ఎకరా భూమి కూడా బినామి పేరుతో కొనుగోలు చేసినట్లు తెల్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం 200 కోట్ల రుపాయాలు వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్ తో పాటు జహీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్ మోమిన్ పేట్ ప్రాంతాల్లో బినామీ ల పేర్లతో స్థలాల గుర్తించారు. డిఎస్పీ ఇంట్లో కిలో బంగారంతో పాటు ఓ బినామి నివాసంలో 40 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించేందుకు మరో రెండు రోజులు సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భీం రెడ్డిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లో స్టేషనరీ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.












Leave a Reply