NewsInn

News in a Click

కోడంగ‌ల్ ఎత్తిపోత‌ల పై స్పెష‌ల్ ఫోక‌స్

కోడంగ‌ల్ ఎత్తిపోత‌ల పై స్పెష‌ల్ ఫోక‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి సాగునీటిని అందించే మ‌క్త‌ల్, నారాయ‌ణ‌పేట‌, కోడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. ఈ ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు జాప్యం జరగొద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో పాటు కొడంగల్ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు సమీక్షించారు.ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు భూసేకరణ పనులు జాప్యం జరగొద్దని, భూసేకరణకు అవసరమైన సర్వేయర్ల నియమించడంతో పాటు బడ్జెట్ మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంగా చెప్పారు. భూసేకరణ పనులను పూర్తి చేసి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆదేశించారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KADA) కింద చేపట్టిన అభివృద్ధి పనులను శాఖల వారిగా సమగ్రంగా సమీక్షించారు. కొనసాగుతున్న ఆయా పనుల వివరాలను తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.

నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో ఏ తండాలో రోడ్డు లేదన్న మాట వినిపించొద్దు, ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చూడాలని చెప్పారు.కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీ భవనాలను నిర్మించాలని, ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులు పర్యవేక్షించాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *