NewsInn

News in a Click

వ‌ర్షా కాలం వానలు మొద‌లు-ఐఎండీ అలెర్ట్

వ‌ర్షా కాలం వానలు మొద‌లు-ఐఎండీ అలెర్ట్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పుడిప్పుడే మొద‌ల‌య్యాయి. రాబోయే రోజుల్లో వ‌ర్షాలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నా…ఇంకా భారీ వ‌ర్షాలు ఈ సీజ‌న్ లో రానే లేదు. అయితే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో మ‌రో రెండు రోజుల్లో భారీ నుండి అతిభాారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీనికి ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకోనున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వర్షాలు మరింత పెరుగుతాయని… ఇందుకు అనుకూలమైన వాతావరణం బంగాళాఖాతంలో సిద్దం అవుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై 23 లేదా 24 అంటే రేపు లేదంటే ఎల్లుండి బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది.

దేశవ్యాప్తంగా కూడా ప‌లు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి… రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనమే కారణమని వెల్లడించింది. అల్పపీడనం బలపడుతూ ముందుకు సాగి దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలను కురిపించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

తెలంగాణపై కూడా ఈ ప్ర‌భావం బ‌లంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని… రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *