న్యూస్ఇన్, హైదరాబాద్: హైదరాబాద్లో రాయదుర్గం భూముల ధర మరోసారి రికార్డు సృష్టించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో రాయదుర్గంలోని ప్లాట్ నంబర్ P1 ఎకరా రూ.264 కోట్ల రికార్డు ధర పలికింది. ప్రభుత్వ సంస్థ నిర్వహించిన భూముల వేలంలో హైదరాబాద్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర ఇదేనని అధికారులు తెలిపారు.
మొత్తం 5.25 ఎకరాల భూమిని ఈ-వేలం ద్వారా విక్రయించగా, టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది.
రాయదుర్గం భూములకు భారీ డిమాండ్….
రాయదుర్గంలోని P1 ప్లాట్కు టీజీఐఐసీ ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించింది. అయితే పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు రూ.264 కోట్ల ధర వచ్చింది. రిజర్వ్ ధరతో పోలిస్తే ఇది దాదాపు 51 శాతం అధికం.
హైదరాబాద్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల ఆసక్తి పెరుగుతున్నదానికి ఈ వేలం ఫలితం నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.
మూడు నెలల్లోనే పాత రికార్డు బద్దలు….
రాయదుర్గంలో టీజీఐఐసీ గత మే నెలలో నిర్వహించిన భూముల వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల ధర పలికింది. తాజాగా P1 ప్లాట్కు ఎకరాకు రూ.264 కోట్లు రావడంతో ఆ రికార్డు అధిగమించింది.
కేవలం మూడు నెలల వ్యవధిలోనే రాయదుర్గం భూముల ధర మరోసారి రికార్డు స్థాయికి చేరడం హైదరాబాద్లో కీలక వ్యాపార ప్రాంతాలపై పెట్టుబడిదారుల ఆసక్తిని సూచిస్తోందని అధికారులు తెలిపారు.

ఎంఎస్టీసీ ద్వారా పారదర్శక ఈ-వేలం….
ఎంఎస్టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా భూముల వేలం నిర్వహించారు. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ప్రత్యేక ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి ప్రముఖ డెవలపర్లు వేలంలో పాల్గొనడంతో పోటీ తీవ్రంగా సాగింది.
తెలంగాణపై డెవలపర్ల నమ్మకానికి నిదర్శనం….
రాయదుర్గం భూములకు లభించిన రికార్డు ధర తెలంగాణపై డెవలపర్లకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని టీజీఐఐసీ ఎండీ శశాంక్ పేర్కొన్నారు. ఇది కేవలం భూమికి అధిక ధర రావడం మాత్రమే కాదని, పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపు అని అన్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి వ్యాపార, పెట్టుబడుల కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నదని ఈ వేలం మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.










Leave a Reply