(న్యూస్ఇన్, హైదరాబాద్)
ఖేలో ఇండియా పథకం భారత క్రీడారంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చే అవకాశం ఉందని
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పతక విజేత జ్వాలా గుత్తా అన్నారు. క్రీడాకారులను క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు ఖేలో ఇండియా పథకంలో ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మీడియా సమావేశంలో జ్వాలా గుత్తా మాట్లాడుతూ, క్రీడారంగాన్ని మార్చగల సామర్థ్యం ఉన్న ఈ పథకం చాలా కాలం క్రితమే రావాల్సి ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉండాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త విధానంలో క్రీడాకారుల ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించి, వారికి శాస్త్రీయ శిక్షణ, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, ఉన్నత స్థాయి పోటీలకు అవసరమైన మద్దతు అందించే అవకాశం దక్కుతుందన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్రీడారంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని జ్వాలా గుత్తా పేర్కొన్నారు. కొత్త ఖేలో ఇండియా పథకంతో అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

రూ.29,054 కోట్లతో ఖేలో ఇండియా పథకం…
కేంద్ర ప్రభుత్వం 2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్ల కాలానికి ఖేలో ఇండియా పథకానికి రూ.29,054 కోట్లు కేటాయించింది. గత కేటాయింపుతో పోలిస్తే ఇది దాదాపు ఎనిమిది రెట్లు అధికం. క్రీడా మౌలిక సదుపాయాలు, ప్రతిభా గుర్తింపు, శిక్షణ, క్రీడా సాంకేతికత, అథ్లెట్ల అభివృద్ధి వంటి అంశాలకు ఈ పథకం ద్వారా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఈ పథకం లక్ష్యం పాఠశాల మైదానాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారిని ఉన్నత స్థాయి శిక్షణ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం. కేంద్ర ప్రభుత్వ ప్రకారం, క్రీడాకారుల అభివృద్ధికి క్షేత్రస్థాయి నుంచి ఒలింపిక్, పారాలింపిక్ స్థాయి వరకు ఒక నిరంతర మార్గాన్ని ఏర్పాటు చేయడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం.
30 క్రీడాంశాల్లో 10 వేల మంది అథ్లెట్లకు ప్రోత్సాహం
పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం కింద 30 క్రీడాంశాల్లో 10,000 మంది ఖేలో ఇండియా అథ్లెట్లతో పాటు 20,000 మంది వర్ధమాన ఖేలో ఇండియా అథ్లెట్లను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2036 నాటికి దేశంలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించే అవకాశాలున్నాయని, ఆ ఒలింపిక్స్ గేమ్స్ లో భారత పలు విభాగాల్లో రాణించేందుకు అనుగుణంగా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
తెలంగాణకు ఖేలో ఇండియా ద్వారా ప్రయోజనం
ఈ పథకం తెలంగాణ క్రీడారంగానికి కూడా కీలకంగా మారనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఖేలో ఇండియా కేంద్రాలు, గుర్తింపు పొందిన అకాడమీలు, స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి క్రీడా సంస్థలు పనిచేస్తున్నాయి.తెలంగాణలో 33 ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరయ్యాయని సమావేశంలో వివరించారు. వీటి ద్వారా మాజీ ఛాంపియన్ క్రీడాకారుల ఆధ్వర్యంలో 601 మందికి పైగా క్రీడాకారులకు శిక్షణ అందుతోంది.
19 ఖేలో ఇండియా అకాడమీలు
తెలంగాణలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, సైక్లింగ్, టెన్నిస్, ఫుట్బాల్ తదితర క్రీడాంశాల్లో 19 ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీలను ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేసినట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర-రాష్ట్రాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం

ఖేలో ఇండియా పథకంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతిభ అభివృద్ధి, అథ్లెట్లను నిలుపుదల చేయడం, క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయికి మార్పు, సంస్కరణల అమలు, ఫలితాల ఆధారంగా నిధుల కేటాయింపు వంటి అంశాలకు ప్రాధాన్యం దక్కనుంది.
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనిబాలా దేవి మాట్లాడుతూ, కొత్త విధానం తెలంగాణ వంటి రాష్ట్రాలకు దీర్ఘకాలిక క్రీడా ప్రణాళిక రూపొందించుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.క్రీడలను విద్యా విధానంతో అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు.
క్రీడా సాంకేతికతకు కొత్త ప్రాధాన్యం
బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ మాట్లాడుతూ, ఖేలో ఇండియా పథకాన్ని మరింత మెరుగుపరిచే దిశగా కార్యాచరణ మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.త్లరలో ఇందుకు సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం విడుదల చేయనుందని చెప్పారు. దేశంలో క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
క్రీడాకారులకు కొత్త అవకాశాలు
ఈ పథకం తెలంగాణలోని యువ క్రీడాకారులకు కొత్త అవకాశాలను అందించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాలు, పాఠశాలలు నుంచి ప్రతిభను గుర్తించి, శిక్షణ, అకాడమీలు, క్రీడా సాంకేతికత, మౌలిక సదుపాయాలు, జాతీయ స్థాయి పోటీలతో అనుసంధానం చేయగలిగితే రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.










Leave a Reply