(న్యూస్ఇన్,హైదరాబాద్)
వచ్చే నెల 7వ తేదీ నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
బ్రిటన్ పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సచివాలయంలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. పెండింగ్ భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా దృష్టి సారించాలని నేతలకు సూచించారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

కొండాసురేఖపై వ్యవహారంపై చర్చ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ వ్యవహారంపై మీడియా సమావేశంలో స్పందించారు. ఈ అంశం పై పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ చేస్తోందని, బహిరంగంగా దీనిపై ఏమి మాట్లాడాల్సింది లేదన్నారు. అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. …కానీ మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో కొండా సురేఖ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొనడం ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.కొండా స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా పార్టీ హై కమాండ్ నుంచి వత్తిడి పెంచాలన్నా అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఓ మహిళమంత్రి కావడం, బలమైన బీసీ సామాజిక వర్గం కావడంతోనే ఆచి తూచి వ్యవహరించాలన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.మొత్తం మీద తెలంగాణా రాజకీయాల్లో కొండా వ్యవహారం కొత్త చర్చలకు, రాజకీయ సమీకరణలకు దారి తీస్తోందన్న వాదన మొదలైంది.
కొండాకు చెక్ పెట్టేలా రేవంత్ అడుగులు…..
కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం క్రమశిక్షణ కమిటీతో పాటు హై కమాండ్ పరిశీలనలో ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి తన పరిధిలోని నిర్ణయాలు అమలు చేయడం మొదలు పెట్టారు. అటవీ శాఖలో డిప్యూటేషన్లు రద్దు చేసేలా ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఐఎఫ్ ఎస్ అధికారుల డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు కూడా వెలువరించారు. సీఎం ఓ ఆదేశాల మేరకే ఈ ఉత్తర్వులు వెల్లడయ్యయని తెలుస్తోంది. సంబంధిత మంత్రి ప్రమేయం లేకుండా ఆదేశాలు రావడంతో… ఇక చర్యలకు కూడా సిద్ధమవుతున్న సంకేతాలే అన్న చర్చ మొదలైంది.

కొండా సురేఖ సమీక్షలు……
మరో వైపు కొండా సురేఖ కూడా తన శాఖ సమీక్షను తన ఇంటి నుంచి ఈ రోజు నిర్వహించారు. వనమహోత్సవం సందర్బంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. రాబోయే కొన్ని రోజుల్లో మంత్రి పదవి ఉంటుందా లేదా అన్న దానిపై చర్చలు జరుగుతున్న సమయంలో కొండా సమీక్ష నిర్వహించడం కూడా ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం అన్న విధంగా కొండా సురేఖ వ్యవహరిస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.












Leave a Reply