హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
(న్యూస్ఇన్,హైదరాబాద్)
తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు పార్టీ క్రమశిక్షణా కమిటీ వరకు వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖపై వేటు పడుతుందా? మంత్రి పదవి నుంచి తప్పిస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటుందన్న ఆ పత్రిక కథనం కొండా పై వేటు వేసేందుకు రంగం సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది.టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఆమె ఇచ్చిన వివరణతో పాటు ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పరిశీలించినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు.
కొండా సురేఖపై వివాదం ఎలా మొదలైంది?
పరకాల నియోజకవర్గ రాజకీయాల నేపథ్యంలో కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో కాంగ్రెస్లోని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రిగా కొనసాగుతున్నా ఆమె కూతురు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం..పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.
షోకాజ్ నోటీసు….

వివాదం తీవ్రం కావడంతో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఆగస్టు 19న మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది.దీనికి స్పందించిన సురేఖ.. తన కుమార్తె చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. కుమార్తె వ్యాఖ్యలపై తనకు సంబంధం లేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తనను వివరణ కోరడం సరికాదని ఆమె తన సమాధానంలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ తరువాత తనతో పాటు తన కుటుంబంపై విమర్శలు చేస్తున్న తనపై జరుగుతున్న పరిణామాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి విచారణ జరిపించాలని ఆమె టీపీసీసీ క్రమశిక్షణా కమిటీని కోరారు. పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
కొండా సురేఖపై వేటు తప్పదా….?
కొండా సురేఖ పై వేటు తప్పదనే సంకేతాలు ఓ ప్రధాన పత్రిక ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆ పత్రికలో కథనం రావడంతో ఇక వేటు తప్పదన్న అభిప్రాయాలు అధికార పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. సీఎంఓ నుంచి లీకేజీ వార్తలే ఆ పత్రిక కథనంగా ప్రచురించిందన్న అనుమానాలు నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టి క్రమశిక్షణా కమిటీ నిర్ణయంపై ఆధార పడింది. ముఖ్యమంత్రి నేడు హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో సీఎంతో సూచనలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.
కాంగ్రెస్ సాహసం చేస్తుందా….
రాష్ట్రంలో నెలకొన్నిరాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ సాహసం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లాంటి నేతలు కూడా సీఎం వైఖరిని తప్పు బట్టినా వారి గురించి ఏమాత్రం చర్చ జరుగడం లేదన్న వాదన వినిపిస్తోంది. బీసీ కోటాలో మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్న కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే పరిణామాలు ఎలా మారుతాయో అన్న అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. కొండాపై మాత్రమే చర్యలు తీసుకుంటే మిగిలిన వారిని పార్టీ ఎలా దారికి తెచ్చుకుంటుందని ఆసక్తి రేపుతున్న ప్రశ్నగా మారింది. మరో వైపు కొండా సురేఖకు పార్టీలోని పలువురు సీనియర్లు కూడా మద్దతుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.

హై కమాండ్ సైలెంట్…….
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సహా పార్టీ హై కమాండ్ ఇప్పటి వరకు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో పలువురు నేతుల కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా…క్రమ శిక్షణా కమిటీ దీనిపై కసరత్తు చేస్తుంది. కొండా సుష్మిత వ్యాఖ్యలతో పాటు ఎమ్మెల్యేల డిమాండ్లు విని తుది నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచింప చేస్తోంది.
చిన్నారెడ్డి సంగతేమిటి….
కొండా పై చర్యలు తీసుకుంటే…చిన్నారెడ్డి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న చిన్న రెడ్డి కి క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇవ్వడంతో ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీ వెళ్లి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సమస్యను పార్టీ ఎలా చక్కదిద్దు తుందా అన్న ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.












Leave a Reply