అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు
(న్యూస్ ఇన్,హైదరాబాద్)
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి నోటీసుకు సమాధానం ఇచ్చారు. గోపాల్పేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జారీ చేసిన నోటీసుకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి చిన్నారెడ్డి సమాధానం ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మల్లు రవికి రాసిన లేఖలో తన వివరణను వెల్లడించారు. గోపాల్పేటలో ఆగస్టు 16, 2026న జరిగిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో చూడాలని కోరారు.
కాంగ్రెస్లో సుదీర్ఘ అనుబంధం…
తాను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్నికైన విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రయాణం ప్రారంభించానని లేఖలో పేర్కొన్నారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటైన సమయంలో పార్టీలో సభ్యత్వం తీసుకుని అప్పటి నుంచి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన AICC కార్యాలయం ఢిల్లీలోని ఇందిరా భవన్, హైదరాబాద్లోని గాంధీభవన్లను తాను పవిత్రమైన దేవాలయాలుగా భావిస్తానని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి పార్టీ అగ్రనేతలను గౌరవిస్తానని తెలిపారు.
అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రశ్నే లేదు….
తాను ఏనాడూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి నేతలపై వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి తనకు ఎప్పుడూ లేదని, భవిష్యత్తులోనూ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలపై వివరణ…
స్థానిక ఎమ్మెల్యేపై అనుచితంగా ప్రసంగించారన్న ఆరోపణపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. గత రెండు సంవత్సరాల ఎనిమిది నెలలుగా స్థానికంగా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షకు గురవుతున్నామన్న వారి ఆవేదనను మాత్రమే తాను కార్యక్రమంలో వ్యక్తం చేశానని తెలిపారు.40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న నాయకులు, కార్యకర్తల మనోభావాలను ప్రస్తావించానని, అయితే ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి…
తనకు ఇచ్చిన వివరణ నోటీసును ఉపసంహరించుకుని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు మల్లు రవిని ఆయన సవినయంగా కోరారు.












Leave a Reply