తనను,కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న వారిపై చర్యలకు డిమాండ్
(న్యూస్ఇన్,హైదరాబాద్)
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినా, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి రాసిన లేఖలో ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు వ్యక్తులను నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై పార్టీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
క్రమశిక్షణా కమిటీ విచారణపై ప్రభావం ఉందా?
క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం వంటి పరిణామాలను కూడా కమిటీ పరిశీలించాలని కొండా సురేఖ కోరారు.
ఈ వ్యాఖ్యలు, డిమాండ్ల వెనుక క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశంపై కూడా విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
పార్టీ క్రమశిక్షణపై నాకు పూర్తి గౌరవం

పార్టీ క్రమశిక్షణపై తనకు పూర్తి గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అయితే, సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా తనపై తీవ్ర వ్యాఖ్యలతో సామూహిక దాడులు జరుగుతున్న సమయంలో పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని ఆమె లేఖలో పేర్కొన్నారు.తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేస్తున్న వారి ఉద్దేశాలను కూడా పార్టీ నాయకత్వం పరిశీలించాలని కోరారు.
పార్టీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె టీపీసీసీ క్రమశిక్షణా కమిటీని కోరారు.












Leave a Reply