NewsInn

News in a Click

ఆయిల్‌ఫెడ్ భూములపై హరీశ్ రావు ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌కు బహిరంగ లేఖ

ఆయిల్‌ఫెడ్ భూములపై హరీశ్ రావు ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌కు బహిరంగ లేఖ

(న్యూస్ఇన్, హైదరాబాద్)

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ఆరోపించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అజామాబాద్‌లో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న సుమారు 3 ఎకరాల 23 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే ప్ర‌య‌త్నాల‌ను త‌ప్పుబ‌ట్టారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. అజామాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ భూమి బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.500 కోట్ల విలువ చేస్తుందని, అయితే కేవలం రూ.87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తికి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో ప్రభుత్వ సంస్థ రూ.87 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తికి అప్పగించాల్సిన అవసరం ఏమిటని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

1987లో సుప్రీంకోర్టు తీర్పుతో ఈ భూమిపై ప్రభుత్వానికి హక్కు ఉంద‌ని తేలింద‌ని లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెడుతోంద‌ని విమ‌ర్శించారు. కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూములపై ఇదే విధమైన విధానాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. అజామాబాద్ భూమిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా చర్యలు తీసుకోవాల‌ని హరీశ్ రావు డిమాండ్ చేశారు
అజామాబాద్ ఆయిల్‌ఫెడ్ భూమి కేటాయింపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి, భూమిని ఆయిల్‌ఫెడ్ ఆధీనంలోనే కొనసాగించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *