(న్యూస్ఇన్, అమరావతి)
జనసేన పార్టీ యువజన విభాగాన్ని సెప్టెంబర్ 2వ తేదీన పిఠాపురంలో అధికారికంగా ఆవిష్కరించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటలకు యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకుల సమక్షంలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జనసేన యువజన విభాగం లోగోతో పాటు గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.

కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆన్లైన్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. . యువజన విభాగం ఏర్పాటు ఉద్దేశం, దాని లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేరళలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన ఆన్లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదే సమయంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
యువతను పార్టీ కార్యకలాపాల్లో మరింత భాగస్వామ్యం చేయడం, రాజకీయ అవగాహన పెంపొందించడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో యువజన విభాగాన్ని పార్టీ ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.












Leave a Reply