(న్యూస్ఇన్, హైదరాబాద్)
అధికార పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత సమయం చిక్కినప్పుడల్లా బీఆర్ ఎస్ ను ఇరుకుపెట్టేలా వ్యవహరించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి.జీఓ 97 గురించి రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతి విద్యా శాఖ నుంచి పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కళాశాలలను శక్తి పేరుతో ఏర్పాటు చేసిన గొడుగు కిందకు పాలిటెక్నిక్ కళాశాలలను తెచ్చే విధంగా చర్యలు తీసుకుంది. దీనిపై విద్యార్థులకు ఎన్నో అనుమానాలున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముందుగా విద్యార్థులను అధికారులు సన్నధం చేయలేకపోయారు. విద్యార్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోతుంది.

విపక్ష పార్టీలు కూడా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్య ను ప్రైవేటు పరం చేస్తుందన్న అనుమానాలు అటు విద్యార్థులు, ఇటు రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్య కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఆత్మరక్షణలో వేసేలా ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన గత ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. కీలకమైన విద్యా శాఖను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న విధానం తెలంగాణాలో అమలు కావాలని కొత్త విధానాలు అవసరం లేదన్నారు. విద్యార్థుల్లో అనుమానాలున్న 92 జీఓ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే విపక్ష పార్టీల విమర్శలతో డిఫెన్స్ లో ఉన్న సర్కార్ ను సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో వేసేలా కనిపిస్తున్నాయి. కడియం వ్యాఖ్యలు అధికార పార్టీలో ఇప్పుడు హాట్ హాట్ గా మారుతున్నాయి.
ఎమ్మెల్యే కడియం చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ జీఓ పై మరో సీనియర్ నేత కేకే ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక అనుగుణంగా తదుపరి చర్యలను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఏకపక్షంగా సర్కార్ తెచ్చిన జీఓ 97 రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా పట్టింపులకు వెళ్లి ఈ జీఓ కు సవరణలు తెచ్చి విద్యార్థుల ఉద్యమాన్ని చల్లబరుస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.











Leave a Reply