(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాత్రివేళ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పహాడి షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన సైనా ఉల్లా (35) శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించి, ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు.
తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శిరీష గత ఏడు నెలలుగా నర్సుగా పనిచేస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఆమె ఆస్పత్రిలో విధుల్లో ఉంది. రాత్రి సమయంలో ఆస్పత్రి ప్రాంగణంలోకి కిటికీ ద్వారా ప్రవేశించిన నిందితుడు శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో శిరీష ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై దాడి చేసి గొంతు నులిమినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గంటల వ్యవధిలోనే మిస్టరీకి ముగింపు…

కేసును సవాల్గా తీసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు అనుమానితుడి ఆచూకీ అతి త్వరగా గుర్తించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు విచారణలో శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు, ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తును ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విచారించి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడికి కఠిన శిక్షించాలి…..
శిరీష మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శిరీష ఏడు నెలలుగా నర్సుగా పనిచేస్తోంది. రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.
తమకు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లామని, తమ కుమార్తె మృతికి అసలు కారణాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Leave a Reply