(న్యూస్ఇన్,హైదరాబాద్)
భక్తి ని ప్రకృతికి జోడిస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ సీడ్ గణేష్ ల పంపిణీ మొదలుపెట్టింది.
వినాయక చవితి పండుగ వస్తోందంటే గ్రామాలు,నగరాలు మండపాలతో, కోలాహలంతో నిండిపోతాయి. పండుగ ముగిశాక జరిగే నిమజ్జనాలు మన నీటి వనరులను కలుషితం అవుతున్నాయి. వ్యాపార లాభాల కోసం తయారు చేస్తున్న గణనాథుల విగ్రహాలే కలుషితం కారకాలన్న వాదన ను పర్యావరణ ప్రేమికులు చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యంగా భక్తిని పర్యావరణ పరిరక్షణతో జోడిస్తూ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (GIC) ఒక అడుగు ముందుకు వేసింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని “సీడ్ గణేశ – వినాయకుడి ఆశీర్వాదం ఒక మొక్కగా మారే ప్రయాణం” పేరిట ఒక షార్ట్ డాక్యుమెంటరీ చిత్రాన్ని విడుదల చేసింది.
పూజ అందుకున్న మట్టి గణపతి.. నిమజ్జనం తర్వాత ఇంట్లోనే కరిగిపోయి, ఒక పచ్చని మొక్కగా రూపాంతరం చెందే వినూత్న ప్రక్రియను ఈ వీడియోలో చూపించారు.

ఈ షార్ట్ ఫిల్మ్ ‘సీడ్ గణేశా కిట్’ (మట్టి గణపతి, కొబ్బరి పొట్టు/కోకోపీట్, విత్తనాల బంతి, నీరు) కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది.కిట్ అన్బాక్సింగ్ మొదలుకొని మొక్క మొలకెత్తే వరకు ఏడు సులువైన దశలను తెలిపే విధంగా డాక్యుమెంటరీ రూపొందించారు.పూజ నుండి కొత్త జీవితం వరకు: ముగ్గులు, పువ్వులు, దివ్యమైన దీపాల కాంతులతో పండుగ వాతావరణంలో ఉన్న ఒక ఇంట్లోకి సీడ్ గణేశా బాక్స్ రావడం, ఆ తర్వాత స్వామివారి ఆశీర్వాదం ఒక కొత్త జీవానికి ఎలా ఊపిరి పోస్తుందో ఈ వీడియో చూపిస్తుంది.సులువైన నిమజ్జనం…. భక్తిశ్రద్ధలతో పూజలు పూర్తయ్యాక, విత్తన బంతిపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచి నీరు పోస్తారు. ఆ మట్టి నెమ్మదిగా కరిగి భూమిలో కలిసిపోతుంది.
ఇంట్లోనే వృక్షం…..
ఏడో రోజు నాటికి చిన్న అంకురం బయటకు రావడం, పదిహేనో రోజుకు అది అందమైన మొక్కగా మారడం కనిపిస్తుంది. ఆ మొక్కకు పిల్లలు నీళ్ళు పోస్తుంటే.. గణనాథుడిని ఇంట్లోకి తెచ్చుకున్న ఆ కుటుంబమే, ఇప్పుడు ఆయన ఆశీర్వాదంతో ఒక మొక్కను పెంచుతున్న ఫీలింగ్ కనిపిస్తుంది.

పర్యావరణ హిత పండుగ కోసం..
వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయన రంగులతో కూడిన విగ్రహాలను చెరువుల్లో, నదుల్లో కలిపి నీటిని కలుషితం చేయకుండా సీడ్ గణేశ ఒక ప్రత్యామ్నాయం. సహజ సిద్ధమైన మట్టితో రూపుదిద్దుకున్న ఈ విగ్రహాల్లో వేప, చింత వంటి రావి లేదా స్థానిక జాతుల విత్తనాలు ఉంటాయి. ఇంట్లోనే ఒక కుండీలో నిమజ్జనం చేయడం వల్ల స్వామివారి రూపం కరిగిపోతుంది కానీ, ఆయన ఆశీర్వాదం ఒక పచ్చని చెట్టుగా మన ఇంట్లోనే ఉండిపోతుంది.
మెగాస్టార్ చేతుల మీదుగా ఆవిష్కరణ…
2020 లో ప్రారంభమైన ఈ ‘సీడ్ గణేశ’ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఏటా విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇటీవల హైదరాబాద్లోని తన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జె. సంతోష్ కుమార్లతో కలిసి ఈ 2026 సీడ్ గణేష విగ్రహాల పంపిణీ మొదలు పెట్టారు.










Leave a Reply