(న్యూస్ఇన్, హైదరాబాద్)
ఓటు హక్కును కాపాడుకోవడంలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన సీఎం.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాలు, బూత్ల వారీగా పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆదరించడం వల్లే ఈ ప్రాంతానికి గుర్తింపు, గౌరవం లభించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం SIR పేరుతో ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారని విమర్శించారు.

మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అనుసరించిన విధానాలను తెలంగాణలోనూ అమలు చేసి విజయం సాధించాలని బీజేపీ చూస్తోందని సీఎం ఆరోపించారు. తెలంగాణలో దొంగదెబ్బ తీసే ప్రయత్నాలను ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
గతంలో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించేవారని, ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిన్న తప్పిదాలను కారణంగా చూపి పేదల ఓట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలను ఆదేశించారు.
ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకుని బీఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి బూత్లో ఒక్క ఓటు కూడా అనవసరంగా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు.












Leave a Reply