(న్యూస్ఇన్, హైదరాబాద్)
మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా అధికార పార్టీ మహాధర్నాకు సిద్ధం అయింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు మహాధర్నా చేపడుతోంది.దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేతను కేసీఆర్ను లక్ష్యంగా అధికార పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి, ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు మహాధర్నాలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. 1,000 రోజులుగా ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా జీతభత్యాలు, ప్రభుత్వ సౌకర్యాలు పొందుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా సమరభేరి కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు, రైతులు, మహిళలు, పెన్షన్ల అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇరుకున పెట్టే యత్నం చేస్తోంది. దీంతో ఇరు పార్టీలు రాజకీయ పోరు క్షేత్ర స్థాయికి తీసుకెళుతున్నాయి.సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందే కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.












Leave a Reply