NewsInn

News in a Click

ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల పై విచార‌ణ‌- అర్హుల‌కే కేటాయింపు

ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల పై విచార‌ణ‌- అర్హుల‌కే కేటాయింపు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల వివరాలపై క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరంగా కొనసాగుతోంది. అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు దక్కేలా ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటుంది… ఎంపికైన దరఖాస్తుదారుల వివరాలను ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను వినియోగిస్తున్నారు.క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో లాటరీ విధానంలో ఇళ్ల కేటాయింపు చేపట్టిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహా ప్రతి నియోజకవర్గంలో 480 ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటితోపాటు వెయిటింగ్ లిస్ట్ కోసం అదనపు దరఖాస్తుదారులను కూడా లాటరీ ద్వారా ఎంపిక చేశారు.లాటరీలో ఎంపికైన వారి వివరాలను పరిశీలించేందుకు దాదాపు 80 మంది అధికారులతో ప్రత్యేక బృందాలను ఉన్న‌తాధికారులు ఏర్పాటు చేశారు. హౌసింగ్ బోర్డుతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలకు చెందిన అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు.

స్వయంగా పరిశీలించిన హౌసింగ్ బోర్డు వీసీ…..

లబ్ధిదారుల వివరాల పరిశీలన ప్రక్రియను హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతంస్వయంగా పర్యవేక్షించారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరిగిన క్షేత్రస్థాయి తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. లాటరీలో ఎంపికైన ఓ దరఖాస్తుదారుడు ప్రస్తుతం బషీర్‌బాగ్‌లోని షేర్‌గేట్ సమీపంలో నివసిస్తున్న ఇంటికి వెళ్లి వివరాలను పరిశీలించారు.దరఖాస్తుదారుడి కుటుంబ వివరాలతోపాటు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి పరిస్థితి, ఇంట్లో ఉంటున్న వారి వివరాలు, ఎంతకాలంగా అక్కడ నివసిస్తున్నారనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో వివరాలను స్వయంగా యాప్‌లో అప్‌లోడ్ చేశారు.

నిర్ధారణ కోసమే క్షేత్రస్థాయి తనిఖీలు…..

ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ సమయంలో ధృవపత్రాలను తీసుకోకుండా దరఖాస్తుదారుల నుంచి ప్రాథమిక వివరాలను మాత్రమే సేకరించారు. దీంతో లాటరీలో ఎంపికైన వారి దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలు వాస్తవమా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన చేప‌ట్టారు. ఈ ప్రక్రియకు లబ్ధిదారులు సహకరించాలని హౌసింగ్ బోర్డు అధికారులు కోరారు.

నాలుగు నియోజకవర్గాల్లో గడువు పొడిగింపు….

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో భాగంగా ముషీరాబాద్, గోషామహల్, ఎల్‌బీనగర్, చంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో కొనసాగుతున్న డిమాండ్ సర్వే దరఖాస్తుల స్వీకరణ గడువును మరో వారం రోజులు పొడిగించారు.
ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆగస్టు 16న ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేశారు. తొలుత సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చారు. అయితే గడువు పెంచాలని వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న హౌసింగ్ బోర్డు..సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *