NewsInn

News in a Click

తెలంగాణాలో ‘చావు’ ల‌ రాజ‌కీయం….!

తెలంగాణాలో ‘చావు’ ల‌ రాజ‌కీయం….!

-అసెంబ్లీ స‌మావేశాల‌తో వ్య‌క్తి గ‌త విమ‌ర్శ‌లు…!!

( న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

రాజకీయాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, విమ‌ర్శ‌లు స‌హ‌జం.ఒక రాజకీయ నాయకుడి మరణాన్ని కోరుకునే వ్యాఖ్య‌లు ప్ర‌ధాన పార్టీల్లో చిచ్చు రేపుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు, ప్ర‌భుత్వ విధానాల‌పై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని భావించినా దాదాద‌పు మూడు రోజుల పాటు చావుల‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. అసెంబ్లీ స‌మావేశాల కంటే స‌హ‌జంగా చేస్తున్న ఈ విమ‌ర్శ‌ల‌కే మీడియాలో ప్రాధాన్యం ద‌క్క‌డం విశేషం.

శాసనసభ స‌మావేశాల సంద‌ర్భంగా తొలి రోజు నుంచే పొలిటిక‌ల్ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ ముందు చావుడప్పు పిలుపు ఆందోళ‌న కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది.దీనికి ప్ర‌తిగా గులాబీ పార్టీలో కింది స్థాయి నేత‌లు సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్ర‌ధానం చేసి నిర‌స‌న తెలిపారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ ఎస్ ఈ అంశాన్ని ప్ర‌ధానాస్త్రంగా మార్చుకోవ‌డంతో కాంగ్రెస్ ఓ అడుగు వెన‌క్కి వేసింది. పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్లు మీడియా స‌మావేశంలో అన్నారు.

రాజకీయాల్లో ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు సాధారణమే అయినా, చావు వంటి సున్నితమైన అంశాలు రాజకీయ నేత‌ల నోటి వ‌చ్చిన స‌మ‌యంలో ఆ ప్ర‌భావం ఆ ఒక్క‌రికే ప‌రిమితం కాకుండా…. కుటుంబ స‌భ్యులు, అనుచ‌రుల్లో కూడా ఆగ్ర‌హం తెచ్చేలా చేస్తోంది. ఈ చ‌ర్చ జ‌రుగుతున్న రోజుల్లోనే అసెంబ్లీలో ఓ ఐఏఎస్ అధికారి వ్య‌క్తి గ‌త స‌హాయ‌కుడు గుండెపోటుతోనే మ‌ర‌ణించ‌డం కూడా అసెంబ్లీలో విషాదం నింపింది.

గ‌తంలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ విధానాల‌ను త‌ప్పు బ‌డుతూ విప‌క్షాలు అధికార పార్టీని ఇరుకున పెట్టేవిగా వ్య‌వ‌హ‌రించాయి. సామాన్య ప్ర‌జ‌ల మ‌ర‌ణాల‌పై చ‌ర్చించే రాజ‌కీయ పార్టీల నేత‌ల మ‌ర‌ణాలు కోరుకుంటుండం సామ‌న్య ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు దారితీస్తోంది.

చావు ఎవ‌రి చేతిలో లేక‌పోయినా…… నేత‌ల మ‌ధ్య బ‌హిరంగ చ‌ర్చ‌కు రావ‌డం ప్ర‌జ‌లు విస్తు పోతున్నారు. రాజ‌కీయంగా అసెంబ్లీ వేదిక‌పై ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కోసం చ‌ర్చ జ‌రుగాల్సిన చోట వారి చావులు వారే కోరుకుంటుండ‌డం… ఏమిట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స‌న్నిత‌మైన అంశాలుపై విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, రాజ‌కీయంగా ప్ర‌చారాస్త్రంగా మార‌డం మాత్రం చ‌ర్చ‌ల స్థాయిని దిగ‌జార్చ‌డం ఖాయం గా క‌నిపిస్తోంది. ఈ చ‌ర్చ కు విస్త్ర‌త ప్ర‌చారం రావ‌డంతో భ‌విష్య‌త్ రాజకీయాల‌పై కూడా ప్ర‌భావం చూపే ప్ర‌మాదం ఉంటుంది. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల మ‌ధ్య‌ ఈ చ‌ర్చ ఏమాత్రం సమంజ‌సం కాద‌న్న వాద‌న బ‌లంగా ప్ర‌జ‌ల్లో వినిపిస్తోంది. మరణం కోరుకుంటూ చేస్తున్న వ్యాఖ్య‌లు అత్యంత సున్నితమైన ఇలాంటి అంశాలపై రాజకీయ నేత‌లు వాడే భాషకు కూడా ఒక హద్దు ఉండాలన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.తెలంగాణ అసెంబ్లీ చర్చలు ఆ దిశగా సాగితేనే మరణాలపై జరుగుతున్న రాజకీయ చర్చ ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌క‌రం అన్న దానిపై ఆలోచించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *