(న్యూస్ఇన్,హైదరాబాద్)
అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించింది. ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ కేసీఆర్ వ్యవహారశైలిని ప్రధాన అంశంగా ప్రస్తావించి చర్చకు తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పదవి అత్యంత బాధ్యతాయుతమైందని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వినియోగిస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహిళా సాధికారతతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను తాము అమలు చేస్తున్నామని చెప్పారు.

తమ ప్రభుత్వ లక్ష్యం ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కల్పించడమేనన్నారు. వైద్య రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు పరిమితం చేసిన గత పాలనకు భిన్నంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
రెండేళ్లలో రూ.1.78 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైందని తెలిపారు. రాష్ట్రంలో 70 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.
కుల సర్వే నిర్వహణ ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని, రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
అసెంబ్లీకి హాజరు కాకుండా ఫామ్హౌస్కే పరిమితమవుతున్న కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు తప్పులను ఎత్తిచూపడం తమ హక్కేనని, అయితే అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.












Leave a Reply