రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం
భక్తులకు భరోసాగా పోలీసులు పనిచేయాలి
(అమరావతి,న్యూస్ ఇన్)
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.రాజకీయం ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని… సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రౌడీయిజం చేసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోం మంత్రి వి.అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు.

గత ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా భ్రష్టు పట్టాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయటం, రప్పా రప్పా లాడించటం ఏమిటో ఎవరికీ ఆర్ధం కావటం లేదన్నారు. బంగారు పాళ్యంలో మామిడి కాయలు తొక్కించారని.. గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించి పొదల్లో పారేసి పోయారని అన్నారు. ఆ తర్వాత అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని వారి బంధువులతో చెప్పించారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధారాలు పెట్టుకోవాలన్నారు. రోడ్లు బ్లాక్ చేయడం, కత్తులతో జంతు బలులు ఇచ్చి పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, అసభ్య పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం నిఘా ఉంచిందని సీఎం తెలిపారు.






Leave a Reply