NewsInn

News in a Click

ఫ్యూచర్‌ సిటీ పేరుతో సీఎం రియల్‌ మాయాజాలం: కేటీఆర్

ఫ్యూచర్‌ సిటీ పేరుతో సీఎం రియల్‌ మాయాజాలం: కేటీఆర్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

ఫ్యూచర్‌ సిటీ పేరుతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం నడుపుతున్నార‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి త‌న‌ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు కల్పిస్తున్నారని విమర్శించారు.

తుక్కుగూడలో ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి సంస్థకు కేటాయించిన భూమి వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్‌ నిరసన చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.7 కోట్లకే ప్ర‌భుత్వం కేటాయించడం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఈ భూకేటాయింపుపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు.

మరో సంస్థకు రూ.1,000 కోట్ల పెట్టుబడుల పేరుతో ప్రభుత్వ రాయితీలు, భూములు, మినహాయింపులు కల్పించే అంశంపైనా కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల సంస్థలకు ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించడం అధికార దుర్వినియోగం, ప్రయోజనాల సంఘర్షణ కాదా అని నిలదీశారు.ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో అధికారానికి దగ్గరగా ఉన్న కుటుంబాలకు సీఎం ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. . ఫ్యూచర్‌ సిటీ భూములపై భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని కేటీఆర్ హెచ్చ‌రించారు.

శాసనసభలో ఈ అంశాలను ప్ర‌శ్నిస్తార‌నే తమను ఈ సెష‌న్ మొత్తం సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి భూకేటాయింపులు, ఫ్యూచర్‌ సిటీ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *