బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం
నేతలకు పార్టీ అధ్యక్షడు దిశానిర్దేశం
(హైదరాబాద్,న్యూస్ఇన్)

అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. సభలో సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజలకు సంబంధించిన కీలక అంశాలను సమర్థంగా, ప్రభావవంతంగా లేవనెత్తాలన్న దిశగా సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై అసెంబ్లీలో బలమైన స్వరం వినిపించి ప్రజాపక్షంగా రాష్ట్ర ప్రజల జీవన సమస్యలను శాసనసభలో కేంద్రబిందువుగా చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు బహిర్గతం చేయడం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం అసెంబ్లీలో బీజేపీ బలమైన పాత్ర పోషించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలు కావడంతో ఆ పార్టీ రెండేళ్లలో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించే అవకాశం ఉందని, అయితే ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఇచ్చిన హామీలను నిలదీసేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యాచరణ అమలు చేయాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కృష్ణా జలాల వ్యవహారం ఇప్పుడు హాట్ హాట్ గా మారడంతో నీటి వాటాల వ్యవహరంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వెదిరె శ్రీరాం సభ్యులకు వివరించారు.దీంతో కృష్ణా జలాలపైనా బిజెపి బలమైన వాదనలను వినిపించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.


Leave a Reply