NewsInn

News in a Click

ఇండిగో సంక్షోభం-ప్రయాణికుల ఆగ్రహం

ఎంటర్ అయిన DGCA

(హైద్రాబాద్,న్యూస్ ఇన్)

ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభంపై దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఆగ్రహం పెరుగుతోంది. ఈ పరిస్థితికి ఇండిగో నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు.దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఒక్కరోజే వెయ్యికి పైగా విమానాలను ఇండిగో రద్దు చేసింది. అంతేకాదు, గత రెండు రోజుల్లో మరో వెయ్యి విమానాలు కూడా క్యాన్సిల్ చేసింది.విమానాల రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికుల ఒత్తిడితో డీజీసీఏ జోక్యం చేసుకుంది. విమానాలు పూర్తిస్థాయిలో నడవడానికి తాత్కాలికంగా కొన్ని నిబంధనలను సడలిస్తామని ఇండిగోకు డీజీసీఏ సూచించింది.ఏ రంగంలోనైనా రెండు మూడు సంస్థల చేతుల్లో ఆధిపత్యం ఉంటే ఏమవుతుందో ఇండిగో ఉదంతం మళ్లీ రుజువు చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.పైలట్లు విరామం లేకుండా వేల కిలోమీటర్లు విమానాలు నడపడం వల్ల వారి ఆరోగ్యానికీ, ప్రయాణికుల భద్రతకీ ప్రమాదం ఏర్పడుతుందని భావించి డీజీసీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇవి 2024 జనవరిలో విడుదల కాగా, మొత్తం 22 నిబంధనల్లో 15 ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి వచ్చాయి. మిగతా 7 నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.

పైలట్ల వారాంత విశ్రాంతిని 12 గంటల నుంచి 48 గంటలకు పెంచడం… రాత్రివేళ ఏ పైలట్‌ అయినా రెండు ల్యాండింగ్‌లకన్నా ఎక్కువ చేయకూడదనే నిబంధన… ఇవన్నీ అమలైతే మరింత మంది సిబ్బంది అవసరం అవుతుందని ఇండిగో భావించింది.ఈ నిబంధనలను కారణంగా చూపిస్తూ నవంబర్‌లో ఇండిగో 1,200కు పైగా విమానాలను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 60 వేల విమానాలను నడిపే ఇండిగోకు ఆ రద్దులు పెద్దగా ప్రభావం చూపలేదు.కానీ ఈ నెల 3వ తేదీన ఒక్కరోజే 500కుపైగా విమానాలు రద్దు కావడం, తర్వాతి రోజుల్లో పరిస్థితి మరింత దిగజారడం వల్ల సంక్షోభం ఒక్కసారిగా ముదిరింది.నిబంధనలు సడలించడంతో పైలట్లు మరింతగా అందుబాటులోకి వస్తారని, పది రోజుల్లో పరిస్థితి పూర్తిగా సర్దుకుంటుందని, డిసెంబర్ 10 నుంచి 15 మధ్య విమాన రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని ఇండిగో సీఈవో పీటర్స్ ఎల్బర్స్ తెలిపారు.

డీజీసీఏ ప్రధాన నిబంధనలను సడలించింది. ఇండిగో A320 విమానాలకు సంబంధించిన FDTL నిబంధనల్లో మార్పులు చేసి, అదనపు విశ్రాంతి కారణంగా విధులనుంచి దూరంగా ఉన్న పైలట్లను తిరిగి డ్యూటీకి రప్పించేలా అనుమతించింది.గతంలో వారానికి రెండుసార్లు మాత్రమే నైట్ డ్యూటీలు ఉండేవి. ఇప్పుడు గరిష్టంగా ఆరు సార్లు నైట్ డ్యూటీలు చేయవచ్చని డీజీసీఏ తెలిపింది. దీంతో రాత్రి సైతం విమాన రాకపోకలు పెరిగే అవకాశం ఉంది.భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి సడలింపు చేయలేదని, కేవలం ఆపరేషన్లు సాగడానికి మాత్రమే మార్పులు చేశామని డీజీసీఏ స్పష్టం చేసింది. సరిపడా పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు పౌర విమానయాన శాఖ సూచించింది.విమానాల రద్దు, ఆలస్యాల కారణాలను గుర్తించేందుకు 4 మంది సభ్యులతో ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కె. బ్రహ్మానే, డిప్యూటీ డీజీ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్‌పెక్టర్ కెప్టెన్ కపిల్ మాంగ్లిక్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్‌పెక్టర్ లోకేష్ రాంపాల్ ఉన్నారు.

15 రోజుల్లో ఈ ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాల్సి ఉంది.

నవంబర్ నుంచి కొత్త నిబంధనలు పాటిస్తూ పైలట్లకు విశ్రాంతి ఇవ్వడం ప్రారంభించిన ఇండిగో, వారి స్థానంలో మరొకరిని డ్యూటీలో పెట్టకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడి, మొదట ఆలస్యాలు… తర్వాత భారీగా రద్దులు ప్రారంభమయ్యాయి.గత మూడు రోజుల్లో రద్దులు పతాక స్థాయికి చేరడంతో ఇండిగో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *