సీనియర్ నేత వ్యూహం ఏమిటన్నది చర్చ
జిల్లాలో హాట్ హాట్ గా మారిన పట్నం వ్యాఖ్యలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం, జిల్లా రాజకీయాలను శాసించిన నేపథ్యం ఆయనది. రాజకీయంగా మూడు దశాబ్దాల అనుభవంతో జిల్లా తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన రూటే వేరు.. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన రంగారెడ్డి జిల్లాలో పట్టున్న నేతగా ఎదిగారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా …జిల్లాలో మాత్రం ఆయన పట్టు కొనసాగిస్తూ వచ్చారు. అధికారంలో ఉన్నా….ప్రతిపక్షంలో ఉన్న ఆయన జిల్లా రాజకీయాల్లో తన పట్టును నిలుపుకుంటూ వస్తున్నారు. తెలంగాణా ఆవిర్భావానికి ముందు వరకు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన ఆయన 2014 ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని దక్కించుకున్నారు. అనూహ్య పరిణామాల మధ్య 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ ఎస్ అవకాశం కల్పించింది. ఆయన తమ్మడు పట్నం నరేందర్ రెడ్డి కోడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో కోడంగల్ 2018 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు.

రాజకీయాల్లో ఉన్న పట్టుతో తన భార్యకు రంగారెడ్డి జిల్లా చైర్మన్ పదవి దక్కించుకున్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గానూ ఆయన సతీమణి జడ్పీ చైర్మన్ అవకాశం పార్టీ కల్పించింది. ఆ తరువాత రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం తో కుటుంబ సభ్యుల్లో తేడా వచ్చింది. పట్నం పార్టీ మారినా సోదరుడు నరేందర్ రెడ్డి గులాబీ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారిన తరువాత ఆయన మండలిలో ప్రభుత్వ విప్ పదవి మాత్రమే దక్కింది. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా అధికార పార్టీలో విప్ గా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన సతీమణికి చేవెళ్ల టికెట్ దక్కించుకునే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీలో ఆయన పప్పులు ఉడక లేదు. చేవెళ్లలో పార్లమెంట్ అభ్యర్థిగా సునితకు అవకాశం ఇవ్వకుండా మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయించేలా సీఎం రేవంత్ పావులు కదిపారన్న ప్రచారం ఉంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజీత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపడంతో మహేందర్ రెడ్డికి రాజకీయంగా గడ్డు కాలం మొదలైందన్న చర్చ జిల్లా రాజకీయాల్లో మొదలైంది. టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో దక్కడం లేదని ఆయన అనుచరుల అభిప్రాయం. జిల్లా రాజకీయాల్లో పట్టున్న నేతగా ఉన్న మహేందర్ రెడ్డి మండలి సభ్యుడు కావడంతో… ఏ నియోజకవర్గంలో కూడా ఆయన వర్గం రాజకీయంగా క్రమంగా పట్టు కోల్పోతున్నట్లు పట్నం అనుచరులు వాపోతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం చేవెళ్ల, ఆయన ప్రాతినిథ్యం వహించే తాండూరులో ఆయన వర్గం అంతా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి పట్టుకోసం పావులు కదపడం మొదలు పెట్టారని అంటున్నారు.

ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినా….రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు మూడేళ్ల తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా మహేందర్ రెడ్డి ఇప్పటి నుంచే పావులు కదపడం మొదలు పెట్టారని మండలిలో వ్యాఖ్యలు విన్న ఆ సీనియర్ నేత అనుచరులు అంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తన వర్గం నేతలను టికెట్లు దక్కించుకోవలంటే ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల్లో తన అనుచరులకు ప ప్రాధాన్యత కల్పించాలని పరోక్ష సంకేతాలు ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న ప్రాధాన్యత ప్రస్తుతం దక్కకుండా పోవడాన్ని పట్నం జీర్ణించుకోలేక పోతున్నారన్న చర్చ కూడా ఉంది. తాండూరులో ఆయన శిశ్యుడిగా గుర్తింపు ఉన్నబుయ్యాని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం పట్నం కుటుంబానికి ఇప్పుడు నియోజకవర్గం లేకుండా చేసిందన్న ప్రచారం ఉంది.మొత్తం మీద జిల్లా రాజకీయాల్లో తన ముద్ర వేసుకునేందుకు సీనియర్ నేత చక్రం తిప్పుతున్నారనే టాక్ వినిపిస్తోంది.






Leave a Reply