పెండింగ్ బిల్లుల విడుదల
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టిన తరువాత వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారులకు సంబంధించిన బిల్లులను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1072 మంది లబ్దిదారులకు సంబంధించిన రూ.12.17 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. ఇటీవల గౌరవనీయులైన గృహనిర్మాణ శాఖ మంత్రి వరంగల్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఎల్-3 కేటగిరీలోని లబ్ధిదారుల బిల్లుల చెల్లింపులఅంశాన్ని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ఇంటిని నిర్మించుకుంటున్న లబ్దిదారుల్లో ఎల్-3 కేటగీరీలోని వారికి కొద్ది కాలంగా బిల్లులు నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఇండ్ల బిల్లు చెల్లింపుల ప్రక్రియలో నిశిత పరిశీలనలో లబ్ధిదారులు ఆర్సీసి అద్దె ఇండ్లలో నివస్తుండటం, గతంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిపొంది ఉండటం తదితర కారణాల వల్ల బిల్లులను విడుదల చేయలేదు.ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో సొంత ఇంటి వసతి లేక ఆర్ సిసి ఇండ్లలో అద్దెకు ఉంటూ ప్రస్తుతం ఇండ్లు కట్టుకుంటున్న వారితోపాటు, పాత ఇందిరమ్మ పథకంలో బేస్ మెంట్ పనుల వరకే లబ్ధి పొంది వారికి చెందిన బిల్లులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ కేటగిరీలోని వారికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి సమగ్రమైన నివేదికలు తెప్పించారు. ఆ నివేదికలను అనుసరించి అర్హులైన 1072 మందికి బిల్లులను విడుదల చేస్తున్నట్లు మేనేజింగ్ డైరక్టర్ తెలిపారు.






Leave a Reply