బాపు ఘాట్ వద్ద కాంగ్రెస్ నిరసన
(హైదరాబాద్,న్యూస్ఇన్)

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో వెన్ను దన్నుగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నామరూపాలు లేకుండా చేసే యత్నం చేస్తోందని హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు ఖాలీద్ సైఫుల్లా ఆరోపించారు. ఈ పథకం పేరు మార్చడం, పథకంలో మార్పులు చేర్పులు చేయడం ఉపాధి హమీ హక్కుపై చేసినే దాడిగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు జీవన విధానంలో భాగంగా మారిన ఈ పథకాన్ని బలహీన పరిచేందుకే కేంద్రం పథకం నిబంధనల్లో మార్పులు చేసిందని ఆరోపించారు. MGNREGA బచావో సంగ్రామ్ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో బాపుఘాట్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ డీసీసీ నిరసన కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్బంగా ఖాలిద్ సైఫుల్లా మాట్లాడుతూ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 180 కోట్లకు పైగా పని దినాలను సృష్టించిందన్నారు. ఈ పథకం ఉపాధి మాత్రమే కాకుండా, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడిందన్నారు. ఈ పథకంలోని మూల సూత్రాలనే కేంద్రం తారుమారు చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడనుందన్నారు. గతంలో ఈ పథకానికి కేంద్రం వంద శాతం నిధులు సమకూరిస్తే….ఇప్పుడు రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి వస్తుందని తద్వారా ఉపాధి హామీ పథకంలో కూలీలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోతుందన్నారు. పథకంలో చేస్తున్న మార్పుల ద్వారా అట్టడుగు వర్గాల కూలీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.




Leave a Reply