సుప్రీం ఆదేశాలంటూ తప్పుడు ప్రచారం
హరీష్ విజ్ఙప్తి తోనే నేటి విచారణ ముగించాము
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నం. 243/2024) దర్యాప్తులో భాగంగా, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావును 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించి.. ప్రశ్నించడం జరిగింది.సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ఈ రోజుకు విచారణను ముగించి ఆయన వెళ్ళేందుకు అనుమతించింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేశాం.

ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఈరోజు హరీష్ రావును విచారించింది కేవలం క్రైమ్ నం. 243/2024 (ఫోన్ ట్యాపింగ్ కేసు)కు సంబంధించి మాత్రమే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది.ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 10.03.2024 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జిషీటు కూడా దాఖలు చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.





Leave a Reply