NewsInn

News in a Click

పర్యాటకానికి ఆంధ్ర ప్ర‌దేశ్ అన్ లాక్

పర్యాటకానికి ఆంధ్ర ప్ర‌దేశ్ అన్ లాక్

పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా

దావోస్‌లో తమారా లీజర్ సీఈఓతో సీఎం చంద్రబాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు కోసం ఏపీని అన్ లాక్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆతిథ్య రంగంలో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని సీఎం పారిశ్రామిక వేత్తలకు వివరించారు. దావోస్ లో ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబులాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి ఆతిథ్య రంగంలో పెట్టుబడి అవకాశాలపై ముఖ్యమంత్రితో తమారా సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు. రాష్ట్రంలోని ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాల గురించి వివరించిన సీఎం హోటల్ రంగంలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామని వివరించారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరంలో అద్భుతమైన టూరిజం కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని స్పష్టం చేశారు. కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభించే అంశాలపైనా సీఎం తమారా లీజర్ ప్రతినిధులతో చర్చించారు. ప్రస్తుతం ప్రతీ పర్యాటక ప్రాంతానికీ రోడ్లు, ఎయిర్ పోర్టులు అందుబాటులో ఉన్నాయని ఇప్పుడు ఏపీ అన్ లాక్ అయ్యిందని స్పష్టం చేశారు. టూరిజం దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మార్చేస్తుందని… ఉపాధి కల్పిస్తుందని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ ప్రతీ జిల్లాలలోనూ అద్భుతమైన పర్యాటక కేంద్రాలున్నాయని వివరించారు.

హోటల్ రంగానికి ఏపీలో ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన తమారా ప్రతినిధులు గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం పార్కులు ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించారు. కమ్యూనిటీ ఫస్ట్ అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు కూడా సిద్ధమని సీఎంకు వివరించారు.

సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు కాలిబో ఏఐ ఆసక్తి

ప్రపంచ ఆర్ధిక సదస్సులో కాలిబో ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజ్ వట్టికూటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఆ సంస్థ సీఈఓ స్కాట్ శాండ్స్ఛఫెర్ కూడా ముఖ్యమంత్రితో జరిగిన భేటీకి హాజరయ్యారు. వట్టికూటి ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమరావతిలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలోని యువతకు ఇప్పటికే ఏఐ అకాడెమీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ప్రారంభించినట్టు కాలిబో సంస్థ తెలియచేసింది. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో యువతకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు. విశాఖ మధురవాడలోని ఐటీ సెజ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కాలిబో ఏఐ సంస్థను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *