ఇటు కాంగ్రెస్…అటు బీఆర్ఎస్ పోటా పోటీ
పోలిటికల్ హీట్ పెంచిన కేసీఆర్ విచారణ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాన్ని సిట్ నోటీసులు ఒక్క సారిగా వేడెక్కించాయి. రెండో సారి మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీచేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హై టెన్షన్ కు దారి తీసింది. శాంతి యుతంగా నిరసన తెలుపాలని బీఆర్ ఎస్ పిలుపు నిచ్చినా….పలు సందర్భాల్లో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బీఆర్ ఎస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారి, ప్రతీ చోట టెన్షన్ వాతావరణం నెలకొంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే బీఆర్ ఎస్ పార్టీ నేతలు గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. సచివాలయం ప్రధాన గేట్ ముందు కూడా సీఎం దిష్టి బొమ్మను బీఆర్ ఎస్ నేతలు దగ్దం చేయడం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు అన్ని ముందుస్తు చర్యలు తీసుకున్నారు. అయినా తెలంగాణా భవన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అదే పరిస్తితి నెలకొంది.

తెలంగాణా భవన్ లో పార్టీ కీలక నేతలు వరుసగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయ కక్ష్యతోనే వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఉదయం 10గంటల నుంచే తెలంగాణా భవన్ కు చేరుకున్నారు. కేసిఆర్ విచారణ పూర్తయ్యే వరకు దాదాపు రాత్రి 8 గంటల వరకు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి సిట్ విచారణ అనంతరం అధినేతను కలిశారు. పార్టీ అధినేత కేసిఆర్ కూడా పార్టీ కీలక నేతలను కలుసుకున్న అనంతరం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ ఎస్ పార్టీ అదే స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎత్తి చూపే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలంతా గాంధీ భవన్ లో వరుసగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేశారు. పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీ హరి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు బీఆర్ ఎస్ హాయంలో జరిగిన పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో కేసిఆర్ కూతురు కవితనే ట్యాపింగ్ పై పలు ఆరోపణలు చేయడంతో ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారని వ్యాఖ్యలు చేసిన విషయాన్ని బీఆర్ ఎస్ నేతలు గుర్తించాలని చెప్పారు. మొతం మీద కేసిఆర్ విచారణ రాష్ట్రంలో హై టెన్షన్ మధ్య పూర్తయింది.



Leave a Reply