NewsInn

News in a Click

కోడంగ‌ల్ లో సీఎం మద్దతు గడి కా-గుడి కా…!

కోడంగ‌ల్ లో సీఎం మద్దతు గడి కా-గుడి కా…!

ఆస‌క్తి క‌రంగా మున్సిప‌ల్ రాజ‌కీయం

(హైదరాబాద్,న్యూస్ఇన్)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగ‌ల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి కే సవాల్ విసురుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా… అధికారపక్షంలోనే చైర్మన్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తి రేపుతుంది. కోడంగ‌ల్ నియోజకవర్గంలో కీలక నేతలుగా గుర్తింపు ఉన్న రెండు కుటుంబాల నుంచి వారసులు రంగంలోకి దిగడంతో రాజకీయం రంజుగా మారుతుంది. రేవంత్ రెడ్డి కోడంగ‌ల్ పాగా వేయకముందు వరకు ఆ రెండు కుటుంబాలే నియోజకవర్గాన్ని రాజకీయంగా శాసించాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, నందారం కుటుంబాలకు నియోజకవర్గంలో ముందు నుంచి రాజకీయ వైరం కొనసాగుతుంది. నియోజకవర్గంపై ఈ రెండు కుటుంబాలే దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయ ఆదిప‌థ్యం చలాయించాయి. ఈ కుటుంబాల వారిగా పార్టీ కార్యకర్తలు నియోజక వర్గంలో విడిపోయి గతంలో ఉన్నారు.

ఒకసారి గుడి… మరోసారి గడి అన్నచందంగా ఆ రెండు కుటుంబాలే అధికారాన్ని పంచుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కోటలో నివాసం ఉండడంతో ఆ కుటుంబానికి (గడి) అని పేరు వచ్చింది…… ఇక మరో కుటుంబం (గుడి)ది….. కోడంగల్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ కుటుంబ సభ్యులు నిర్మించడంతో ఈ కుటుంబానికి గుడి గా పేరు వచ్చింది. నందారం కుటుంబం నుంచి నందారం వెంకటయ్య, నందారం సూర్యనారాయణలు ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు. శాసనసభ ఎన్నికలొస్తే అయితే గడి లేదంటే గుడి అనే నానుడి కోడంగ‌ల్ఉండేది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో రెండు కుటుంబాలకు రాజకీయ ప్రాతినిత్యం కోల్పోవాల్సి వ‌చ్చింది.

గతంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన ఈ రెండు కుటుంబాలు ప్రస్తుతం కోడంగ‌ల్ మున్సిపల్ చైర్మన్ స్థానంపై కన్నేశాయి.ఇప్పుడు కూడా ఆ రెండు కుటుంబాలకు చెందిన వారసులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడుతుండడం సీఎం రేవంత్ రెడ్డికి రాజ‌కీయంగా తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. కోడంగ‌ల్ మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ కావడంతో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తనయుడు జగదీశ్ రెడ్డి… నందారం వెంకటయ్య మనవడు నందారం ప్రశాంత్ ఆ స్థానం కోసం పోటీపడుతున్నారు. ఈ ఇద్దరు వేరువేరు వార్డుల్లో పోటీ చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తన తనయుడికి చైర్మన్ స్థానం మరోసారి కట్ట పెట్టాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.చైర్మన్ స్థానం జనరల్ స్థానం కావడంతో నందారం ప్రశాంత్ కు ఈసారి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కొడంగల్ లో పోటీ చేసినప్పటి నుంచి ప్రశాంత్ ఆయన ప్రధాన అనుచరుడుగా కొనసాగుతూ ఉండడంతో రేవంత్ కూడా నందారం ప్రశాంత్
వైపే మొగ్గు చూపుతున్నారన్న చర్చ ఉంది. దాదాపు రెండు వారాల పాటు సీఎం రాష్ట్ర అందుబాటులో లేకపోవడంతో ఈ చర్చ కొడంగల్ లో మరింత పెరిగింది.

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు రావడంతో త్వరలో కొడంగల్ చైర్మన్ స్థానం పంచాయతీ పై దృష్టి పెట్టె అవకాశం కనిపిస్తుంది.ఇద్దరిని ఎలా సమన్వయం చేస్తారన్నది నియోజకవర్గంలో హాట్ హాట్ చర్చగా మారింది. చైర్మన్ స్థానంపై ఇప్పుడే రేవంత్ రెడ్డి కూడా తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తే చైర్మన్ అభ్యర్థులు పోటీ చేస్తున్న వార్డుల్లో రాజకీయంగా సమీకరణలు కూడా మారే అవకాశం ఉంటుంది.

ఈ కారణంగా ఫలితాలు వచ్చిన తర్వాతే చైర్మన్ స్థానంపై సీఎం క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ పెడుతున్నా…. స్థానికంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. గురునాథ్ రెడ్డి కుటుంబానికి చైర్మన్ స్థానం దక్కకపోతే ఆ కుటుంబం రాజకీయంగా సీఎంకు భవిష్యత్తులో ఏ మేరకు సహకరిస్తుందన్న చర్చ కూడా మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *