సెల్ ఫోన్లు స్విఛ్చాఫ్… అడ్రస్ లేని అభ్యర్థులు
కోడంగల్ లో కొత్త నిబంధనలు..?
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయంగా పట్టు కోసం రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ ఓ అడుగు ముందుకు వేసి తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలను వత్తిళ్లకు గురి చేస్తోంది. కొంత మంది అభ్యర్థులు అధికార పార్టీ చేస్తున్న వత్తిళ్లకు తలొగ్గుతున్నా…మరికొంత మంది మాత్రం ఎన్నికల బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సైలెంట్ గా కౌంటర్ వ్యూహం అమలు చేస్తోంది. రిజర్వేషన్లకు అనుగుణంగా చైర్మన్ అభ్యర్థులు పోటీ పడుతున్న వార్డులపై రెండు ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి.

ఆ వార్డుల్లో వ్యూహాత్మకంగా ఒకటి కంటే ఎక్కువ మందితో నామినేషన్లు వేయించింది. నామినేషన్ల అనంతరం నామినేషన్ వేయించిన అభ్యర్థులను,ప్రతిపాదించిన వారిని నామినేషన్ ప్రక్రియ ముగియడంతోనే శిబిరాలకు తరలించింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయితే తప్ప ఆ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రజా క్షేత్రంలో కనిపించే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ తరపున అధికార పార్టీ చైర్మన్ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఒకరిని మాత్రమే బరిలో ఉంచి అక్కడే కాంగ్రెస్ అభ్యర్థులకు చెక్ పెట్టాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోంది.

ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలోని చాలా మున్సిపాల్టీల్లో ఉన్నాయి. ఉదాహరణకు కోడంగల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఏకగ్రీవాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. కోడంగల్, కోస్గి, మద్దూరు మున్సిపాల్టీల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేలా గులాబీ పార్టీ నేతలు తమ అభ్యర్థులను రంగంలో దించారు. నామినేషన్లు వేసిన మెజార్టీ అభ్యర్థులు ఆ వెంటనే మాయ మయ్యారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. అభ్యర్థులను ప్రతిపాదించిన వారి పరిస్థితి కూడా ఇదే. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప సంహరణకు గడువు ఉండడంతో ఆ సమయం తరువాతే అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోస్గి,మద్దూరు మున్సిపాల్టీల్లో గులాబీ పార్టీ నుంచి కొన్ని వార్డుల్లో ఒక్కరికి మించి అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారిని ఉపసంహరింప చేసే విధంగా గులాబీ నేతలు పావులు కదుపుతున్నారు. వికారాబాద్ మున్సిపాల్టీలో స్సీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతరు అనన్య చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఆ స్థానంపై బీఆర్ ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కీలక స్థానాల్లో పోటీచేసే గులాబీ అభ్యర్థులను ఆ పార్టీ నేతలే శిబిరాలకు తరలించి కాంగ్రెస్ కు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు సృష్టించేలా పావులు కదుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లు , ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ పరిస్థితులు కలిసి వస్తుందన్న ధీమా గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

కోడంగల్ లో కొత్త నిబంధనలు….?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు కొత్త నిబంధనలను అమలు చేసేలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.గులాబీ నేతలపై నామినేషన్ల ఉప సంహరణకు అధికారుల ద్వారా నిబంధనల పేరుతో శిబిరాల్లో ఉన్న నేతలను బయటకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉన్న నేతలు లేదంటే వారిని ప్రతిపాదించిన వారే స్వయంగా వచ్చి బీ-ఫామ్ లు అందజేయాలని అధికారులు వారి సన్నిహితులపై వత్తిడి తెస్తున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. స్వయంగా అభ్యర్థులు లేదంటే ప్రతిపాదించిన వారు హాజరైతే వారితో నామినేషన్ల ఉపసంహరణ చేయించడం సులువు అవుతుందన్న అనుమానాలు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.




Leave a Reply