17 ఏళ్ల మొండి బకాయి క్లియర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాజకీయం, పదవి యోగం ఈ రెండింటికీ వీడదీయరాని అనుబంధం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికే వీటి గురించి ఎక్కువగా తెలుస్తోంది. పదవీ దక్కుతుందంటే రాజకీయాల్లో ఉన్న నేతలు దేనికైనా వెనుకాడరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన ఆసక్తి కరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు నిజామాబాద్ పట్టణంలో ప్రముఖ హోటల్ నిర్వహించిన ఓ కాంగ్రెస్ నేత తన రాజకీయ పరపతితో ఆస్తి పన్ను చెల్లించలేదు. 2009 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులు రాజకీయంగా అదృష్టం వరించడంతో ఒక్క దెబ్బకు పెడింగ్ ఆస్తి పన్ను బకాయిని మొత్తం చెల్లించారు. ఏదో ఒకటో, రెండు లక్షలు కాదు….. 17 ఏళ్లలో పెండింగ్ బకాయి పన్ను అక్షరాల 8 కోట్ల 16 లక్షల 65 వేల 600 రుపాయలు కార్పోరేషన్ ఎన్నికల పుణ్యమా అంటూ చెల్లించాల్సి వచ్చింది.

రాష్ట్రంలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలో ప్రముఖ హోటల్ లో డైరెక్టర్ గా నరేందర్ రెడ్డి అధికార పార్టీ తరపున రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. తన భార్యను కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయించి మేయర్ పదవి దక్కించుకోవాలని రాజకీయంగా పావులుకదుపుతున్నారు. పార్టీ హై కమాండ్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సంకేతాలు ఇచ్చింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న నరేందర్ రెడ్డి తన భార్య శమంతకరెడ్డిని పోటీలో దించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉండడంతో…. కార్పోరేషన్లో బకాయి ఉన్న మొత్తాన్ని శమంతక రెడ్డి చెల్లించాల్సి వచ్చింది.
దాదాపు రెండు దశాబ్దాలు తన పరపతితో పన్ను చెల్లించని నేత ఇప్పుడు కూడా పన్ను పెండింగ్ లో ఉంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు. పన్ను దాట వేసేందుకు న్యాయ స్థానం తలుపు తట్టారు….చివరి నిమిషం వరకు ఆ పన్ను బకాయిగానే ఉంచి పోటీ చేయాలని పావులు కదిపారు. కానీ నిబంధనల ముందు నరేందర్ రెడ్డి ప్రయత్నాలు ఫలించలేదు. న్యాయ స్థానం కూడా పన్ను చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పెండింగ్ లో ఉన్న ఆ మొత్తం నిధులను ఆరు డీడీల రూపంలో కార్పోరేషన్ కు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ పొంది నామినేషన్ దాఖలు చేశారు.

రాజకీయాల్లో కీలక పదవి లేకున్నా…. నరేందర్ రెడ్డి 17 ఏళ్లుగా ఆస్తి పన్ను చెల్లింపులో చేసిన జాప్యం ఇప్పుడు హాట్ హాట్ మారింది. పదవిలో లేకపోయినా భారీ మొత్తం బకాయి పెడితే ….కీలక పదవులు వరిస్తే ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కరమైన చర్చగా మారింది. ఎన్నికల్లో గెలిచేందుకు, గెలిస్తే ఆ తరువాత తన అధికార పరపతిని ఏ స్థాయిలో వినియోగించుకుంటారన్నది కూడా ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. పొలిటికల్ గా కాంగ్రెస్ నేతల తీరు ఇలా ఉంటుందన్న చర్చ సహజంగా జరుగుతోంది. ఇది పార్టీకి, ఆయనకు ఎన్నికల్లో కలిసి వస్తుందా…..దూరం చేస్తుందా అన్నది ఫలితాలే నిర్ణయిస్తాయి.
సామాన్యులను ముక్కుపిండి బకాయిలు వసూలు చేసే అధికారులు ఓ హోటల్ నిర్వాహకుడు 8 కోట్లకు పైగా బకాయి ఉంటే ఏం చేశారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.







Leave a Reply