అందిపుచ్చుకునేలా పావులు కదపండి : కేటిఆర్

(హైదరాబాద్,న్యూస్ ఇన్)
కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని అందిపుచ్చుకునేలా పార్టీ నేతలు దృష్టి సారించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సూచించారు. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధం అయ్యేలా పార్టీ ఇంచార్జ్ లు, సమన్వయ కర్తలు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. రేపటి నుంచి ఇక ప్రచార పర్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు, అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు.ఎన్నికల వ్యూహంలో భాగంగా సమన్వయం కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు. చాలా చోట్ల పార్టీ విజ్ఞప్తిని మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను కలుపుకుని ప్రచారం చేయాలన్నారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికి అభ్యర్థులు స్వయంగా వెళ్లి, వారిని ప్రచారంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలను అంచనా వేసి, గెలుపు గుర్రాలను గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అభ్యర్థుల గెలుపుతో పాటు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచడం పైన కూడా నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మున్సిపల్ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన క్షేత్రాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు.




Leave a Reply