NewsInn

News in a Click

కృష్ణా నదీ జలాలపై హక్కును వదులుకోం

వాటాల కేటాయింపుపై పునఃసమీక్షకు నో

రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించండి

సీఎం చంద్రబాబు

(అమరావతి, న్యూస్ఇన్)

కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు వీలు లేదని, చట్టపరంగా ఏపీకి దక్కిన వాటాను యధాతథంగా కొనసాగించాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల వాటా కలిగి ఉండగా… రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్-1 ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చొప్పన జలాలు కేటాయించిందన్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపులను పునఃసమీక్షించాలనడం సరికాదని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు.

అన్ని జిల్లాలకు నీటి భద్రతే లక్ష్యం

రాష్ట్రాన్ని కరువు రహితం చేసేలా… అన్ని జిల్లాలకు నీటి భద్రత కలిగించేలా… సమర్ధ నీటి నిర్వహణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వాయర్లలో నెలకొన్న నీటి నిల్వల వివరాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 25 నాటికి రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం 1,095 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు అన్నీ కలిపి సామర్ధ్యంలో 83.43 శాతం మేర నిండాయని తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసినా పలు రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండక పోవడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని అధికారులకు సూచించారు. గ్రావిటీ ద్వారా పూర్తిస్థాయిలో నిండని రిజర్వాయర్లను గుర్తించి… వాటిని లిఫ్ట్ ద్వారా నింపేందుకు చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *