NewsInn

News in a Click

కోడంగ‌ల్ లో ‘గుడి’ కే ప‌ట్టం క‌ట్టిన సీఎం రేవంత్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కోడంగ‌ల్ లో కూడా మున్సిప‌ల్ చైర్మ‌న్ ల ఎంపిక ఆస‌క్తి రేపింది. మున్సిప‌ల్ ఎన్నిక‌లు మొద‌లైన నాటి నుంచి కోడంగ‌ల్, కోస్గి, మ‌ద్దూరుల‌లో ఎవ‌రికి ఈ ప‌ద‌వులు వ‌రిస్తాయో అంచ‌నాతో కాంగ్రెస్ నేత‌లు స‌త‌మ‌త‌మ‌వుతూ వ‌చ్చారు. మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా కాంగ్రెస్ ఏకప‌క్షంగానే విజయం ద‌క్కించుకుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన బీఆర్ ఎస్ మ‌ద్దూరులో మాత్రం పోటీ ఇవ్వ‌గ‌లిగింది. కోడంగ‌ల్ బీఆర్ఎస్ ఒక స్థానానికి ప‌రిమితం కాగా, కోస్గిలో బీఆర్ ఎస్ ఒక్క స్థానం కూడా ద‌క్క‌లేదు. ఈ ప‌రిస్థితుల్లో అక్క‌డ విజయం ద‌క్కించుకున్న వారిలో ఎవ‌రికి మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వులు ద‌క్కుతాయో అన్న చ‌ర్చ ఎన్నిక‌లు మొద‌లైన నాటి నుంచి ఉంది.

కోడంగ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ స్థానంపై నియోజ‌క‌వ‌ర్గంలోని అంద‌రి దృష్టి ఉంది. స్థానికంగా మాజీ ఎమ్మెల్యేల వారుసులు రంగంలోకి దిగ‌గ‌డంతో సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి ప్రాధాన్య‌త ఇస్తార‌న్న ఉత్కంఠ రేపింది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి త‌న‌యుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందారం వెంక‌ట‌య్య మ‌నువ‌డు నందారం ప్రశాంత్ ల‌లో చైర్మ‌న్ స్థానం ఎవ‌రికో ఒక‌రికి ద‌క్కుతుంద‌ని ముందు నుంచే ప్ర‌చారం జ‌రిగింది. ఈ రేస్ లో ప్ర‌శాంత్ ముందున్న‌ట్లు స్థానిక నేత‌లు చెబుతూ వ‌చ్చారు. ఎంద‌కంటే గ‌త ప్ర‌భుత్వ హాయంలో గురునాథ్ రెడ్డి త‌న‌యుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి చైర్మ‌న్ గా ఉండ‌డంతో…. మ‌రోసారి ఆయ‌న‌కు కాంగ్రెస్ లో అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌న్న అనుమానాలు వ్య‌క్తంచేశారు. దీంతో ఈ స్థానం గురునాథ్ రెడ్డి కుటుంబం నివాసం ఉండే (గ‌డీ) , నందారం కుటుంబం నివాసం ఉండే వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యం (గుడి)కి క‌ట్ట‌బెడుతారా అని ఉత్కంఠ రేగింది. చైర్మ‌న్ స్థానం కోసం బ‌రిలోఉన్న నేత‌లు ఇద్ద‌రు కూడా విజ‌యం సాధించ‌డం, ఇద్ద‌రిలో ఒక‌రికి చైర్మ‌న్ ఒక‌రికి వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. రేవంత్ రెడ్డి కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన నాటి నుంచి మ‌ద్ద‌తుగా ఉండ‌డంతో ప్రశాంత్ కే చైర్మ‌న్ ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని, జ‌గ్గ‌ప్ప వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

ఇక ఎన్నిక‌ల‌కు ముందు చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు మారిన స‌మీక‌ర‌ణ‌ల‌తో గ‌డీకి వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ద‌క్క కుండా పోయింది. నందారం ప్ర‌శాంత్ ( గుడి) కి చైర్మ‌న్ ప‌ద‌విని ఖ‌రారు చేశారు. కోస్గి మున్సిప‌ల్ చైర్మ‌న్ గా నాగుల‌ప‌ల్లి న‌రేందర్, వైస్ చైర్మ‌న్ గా చింత‌ల స‌రిత ఎన్నిక‌య్యారు. మ‌ద్దూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ గా దిలిక‌ర్ స‌ర‌స్వ‌తి, వైస్ చైర్మ‌న్ గా భాగ్య‌శ్రీని ఎన్నుకున్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కోడంగ‌ల్ లో గ‌డికి ప్రాధాన్య‌త త‌గ్గిపోయింది. గ‌డీల పాల‌నకు పాత‌ర వేసానంటూ నిత్యం ఆరోప‌ణ‌లు చేసే సీఎం రేవంత్ రెడ్డి స్థానికంగా కూడా అదే వ్యూహాన్ని అమ‌లు చేశార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌ద్దూరు మున్సిపాల్టీలో కూడా వైస్ చైర్మ‌న్ విష‌యంలో రాజ‌కీయంగా దూమారం రేగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *