(హైదరాబాద్,న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఓ స్టార్ హోటల్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రాధాన్యతలను వివరించేందుకు కీలకమైన అడుగు ముందుకు వేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మూడు జిల్లాల నేతలను ఆహ్వనించి మూసీ పునరుద్ధరణ, ప్రభుత్వ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ను ఎలా పూర్తి చేయాలనుకున్నామో వివరించారు. ఈ రోజు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అందుకు పోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ నిర్వాసితుల సమక్షంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేద ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న దానిపై బీఆర్ ఎస్ ప్రధానంగా ఫోకస్ చేయనుంది. మూసీ పునరజ్జీవ పథకానికి తాము వ్యతిరేకం కాదంటుంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మూసి నది ప్రక్షాళన, అభివృద్ధి, సుందరీకరణ కోసం రూపొందించిన ప్రణాళికలు, చేపట్టిన పనులు, భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ గణాంకాలతో సహా వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఎవరికీ నష్టం కలగకుండా, పేదల ఇళ్లను కూల్చకుండా కూడా మూసి నది పరిసరాలను ఎలా సుందరీకరించవచ్చో వివరించనున్నారు..
ఇటీవల మూసి పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతామనే భయంతో ఆందోళన చెందుతున్న బాధితులకు బీఆర్ ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన మూసి సుందరీకరణ పనులను కూడా ప్రత్యక్షంగా సందర్శించి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించారు.

మూసి పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, అభివృద్ధి కూడా కొనసాగించేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయని కేటీఆర్ ఈ ప్రజెంటేషన్లో వివరించనున్నారు. మూసి అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం అవసరం లేదని, సరైన ప్రణాళికతో నది పునరుజ్జీవం సాధ్యమని గణాంకాలు, మ్యాపులు, ప్రాజెక్టు వివరాలతో ప్రజల ముందుంచనున్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. మూసి అంశంపై ప్రజలకు స్పష్టత ఇచ్చే కీలక కార్యక్రమంగా ఈ ప్రజెంటేషన్ నిలవనుంది.
మూసి నది అభివృద్ధి పేరుతో ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రజెంటేషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.








Leave a Reply