(హైదరాబాద్,న్యూస్ఇన్)
గత కొన్ని రోజులుగా తెలంగాణా రాజకీయాల్లో జగిత్యాల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జగిత్యాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పొలిటికల్ సర్కిల్స్ హాట్ హాట్ గా మారింది. జగిత్యాలలో పట్టు సాధించాలన్న లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డికి రాజకీయంగా ఈ ఆపరేషన్ తో చెక్ పెట్టినట్లయింది.
సీఎం రేవంత్ ఫోకస్………..

జగిత్యాలలో సీనియర్ నేత పార్టీని వీడడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ పట్టుకోల్పోకుండా అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలతో హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జీవన్ రెడ్డి తో పాటు పార్టీ క్యాడర్ బీఆర్ ఎస్ లో చేరకుండా బ్రేకులు వేసే పనిలో సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు పడ్డారు. సీఎం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ సహా మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావ్, అడ్లూరి లక్ష్మణ్ లతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డిని ఎప్పుడు తక్కువ చేసి చూడలేదని, ఆయన మర్యాదను తగ్గించలేదన్నారు. ఆయన తో ఆయన కుటుంబ సభ్యులు పార్టీని వీడకుండా అన్ని విధాలుగా హామీ ఇచ్చినా జీవన్ రెడ్డి పట్టించుకోలేదన్నారు.40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ లో పదవులు అనుభవించి ఈ సమయంలో దుర్మార్గుడైన కేసీఆర్ తో జత కట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీకి అండగా ఉండాలని మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే బాద్యత తనది సీఎం వ్యాఖ్యానించారు. త్వరలో జగిత్యాలలో పర్యటించి అభివృద్ది చేసుకుందామని సీఎం కార్యకర్తల్లో జోష్ నింపే యత్నం చేశారు.
కేసిఆర్ రావాలి- రేవంత్ పోవాలి…

సంజయ్ కాంగ్రెస్ లో చేరిన తరువాత సీనియర్ నేత వర్గానికి నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాధాన్యత పూర్తిగా కరువైంది. ఆయన సహా అనుచరులకు పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన నేతలకే అవకాశం కల్పించడంతో ఈ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ వరకు వెళ్లింది. అయితే సీనియర్ నేతకు ఎక్కడా……. పార్టీ నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు దక్కలేదు. కొంత మంది సీనియర్ నేతలు ఆయనతో టచ్ లో ఉన్నా…. పార్టీ నిర్ణయాల్లో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో ఇక పార్టీలో కొనసాగలేనని జీవన్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో కలిసి వచ్చిన అవకాశాన్ని బీఆర్ ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదిపి విజయవంతం అయింది. సీనియర్ నేతను కారెక్కించుకోవడంలో విజయవంతం అయింది. ఈ నెల 20వ తేదీన బీఆర్ ఎస్ జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలోనే బీఆర్ ఎస్ లో సీనియర్ నేత చేరనున్నారు. జీవన్ రెడ్డి అనుచరులను ఇదే సమయంలో పెద్ద ఎత్తున కారు పార్టీలో చేర్చుకునే విధంగా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. కేసీఆర్ రావాలి- రేవంత్ పోవాలి అన్న నినాదంతో బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ ఎస్ నిర్ణయం తీసుకుంది.సభను విజయవంతం చేసేందుకు గులాబీ పార్టీ మండలాల వారిగా ఇంచార్జ్ లను నియమించి భారీ జనసమీకరణ చేసేందుకు రెడీ అవుతోంది. సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ ఈ బహిరంగ సభతోనే రాష్ట్ర రాజకీయాలపై స్పందించనున్నారు.








Leave a Reply