NewsInn

News in a Click

ప్ర‌తిప‌క్షాలు ఓడించింది బీజేపీ దురుద్దేశాల‌నే

ప్ర‌తిప‌క్షాలు ఓడించింది బీజేపీ దురుద్దేశాల‌నే
  • సీఎం రేవంత్ రెడ్డి

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, నియోజ‌క‌వ‌ర్గాల పెంపు బిల్లుల ముసుగులో రాజ్యాంగం మార్పు, రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుకు బీజేపీ చేసిన ప్ర‌య‌త్నాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇత‌ర విప‌క్షాలు క‌లిసి ఓడించాయ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. బిల్లులు వీగిపోవడం కేవలం కేంద్రంలోని అధికార పార్టీ ఓటమే కాదు బీజేపి చిత్తశుద్ది కూడా అని, ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి చిత్తశుద్ది సరిగా లేనందునే రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు వీగిపోయింద‌న్నారు. పార్ల‌మెంట్‌లో ఓడిపోయింది బీజేపీ ప్ర‌భుత్వ దురుద్దేశ‌మేన‌న్నారు. ఈ బిల్లులు వీగిపోవ‌డానికి కార‌ణ‌మైన నేత‌లంద‌రికీ సీఎం కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో శ‌నివారం విలేక‌రుల‌తో మాట్లాడారు.

ప్ర‌స్తుతం లోక్ సభలో ఉన్న 543 సీట్ల‌లో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంట్ ముందుకు తీసుకురావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమితో కలిపి 2023 మాదిరిగా ఆ బిల్లుకు తాము మద్దతు ఇస్తామ‌ని, సోమవారం బిల్ పాస్ చేసుకొని… మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయ‌వ‌చ్చ‌ని సీఎం తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు అఖిల‌ప‌క్ష స‌మావేశాలు ఏర్పాటు చేయాల‌ని, నిపుణుల‌తో చ‌ర్చించాల‌ని, ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాల‌ని, ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధ‌న‌కు కృషి చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఆయా రాష్ట్రాల‌తో సంప్ర‌దించి శాస‌న‌స‌భ‌ల్లో స్థానాల సంఖ్య పెంచ‌వ‌చ్చ‌ని సీఎం అన్నారు.

వీగి పోయిన మ‌హిళా బిల్లు…….

మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ చిత్తశుద్ది ఏమిటో తేల్చుకుందామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు. కేంద్ర ప్ర‌భుత్వానికి చిత్త శుద్ది ఉంటే 2027లో జ‌రిగే ఎన్నిక‌ల్లోకూడా మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌వ‌చ్చ‌న్నారు. ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే… తెలంగాణ సీఎంగా తాను బాధ్యత తీసుకొని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధ‌రామ‌య్య‌, చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం రంగ‌సామిల‌తో చర్చలు జరుపుతానని సీఎం తెలిపారు. ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతాన‌ని చెప్పారు. మ‌హిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ‌జేసింద‌న్నారు. త‌మ‌కు గంట స‌మ‌యం ఇస్తే బిల్లును మార్చివేస్తామ‌ని అమిత్ షా అన్నార‌ని… సోమ‌వారం వ‌ర‌కు స‌మ‌యం ఉంద‌ని, ప్ర‌స్తుతం ఉన్న 543 సీట్ల‌తోనే బీజేపీ మ‌హిళా బిల్లు తీసుకువ‌స్తే మంగ‌ళ‌వార‌మే పాస్ చేస్తామ‌ని సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *