
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి ఇవాళ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. వాటిని చట్టపరంగా సమర్థవంతంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా తగిన ఆధారాలను సమర్పించలేకపోవడం వల్ల, కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థతకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపితమైంది.
ఈరోజు రాష్ట్ర హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదు. రేవంత్ సర్కార్.. హామీలను మాటలకే పరిమితం చేస్తూ.. అవినీతికి పాల్పడిన వ్యక్తులను వదిలేస్తున్నారు.
గత రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నకాంగ్రెస్ పార్టీ ప్భుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ.. తెలంగాణ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటోంది కాబట్టి.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలకు వెనుకాడుతోంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యం, ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణ ప్రజలకు చేస్తున్న రాజకీయ ద్రోహం.




Leave a Reply