
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని, వారి మధ్య ఉన్నది ‘ఫెవికాల్ బంధం’ అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందుతున్నాయని ఆరోపిస్తుంటే, ఆ మూటలను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిది కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా బండి సంజయ్ తాను ఒక కేంద్ర మంత్రిని అనే విషయాన్ని గుర్తించాలని, కరీంనగర్ గల్లీల్లో కార్పొరేటర్ లా మాట్లాడటం మానేసి తన పదవికి తగ్గట్టుగా వ్యవహరించాలని హితవు పలికారు. కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ నుంచి ఏఐసీసీకి వెళ్తున్న ప్రతి పైసాను పట్టుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్న ‘ఆర్ఆర్ టాక్స్’ ఢిల్లీ పెద్దలకు చేరుతుంటే బీజేపీ నేతలు గాడిదలు కాస్తున్నారా అని నిలదీశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డికి సహాయం చేయడం తప్ప, తెలంగాణ రాష్ట్రానికి బండి సంజయ్ ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గమైన వేములవాడలోని గుడి ‘దివ్య భారత్’ స్కీమ్లో చేరలేదన్న విషయం కూడా బండి సంజయ్కి తెలియకపోవడం విచారకరమన్నారు. అమృత్ పథకం నుండి సింగరేణి వరకు ప్రతి విషయంలో స్కామ్ జరుగుతుంటే, కిషన్ రెడ్డి మౌనంగా ఉంటూ కాంగ్రెస్ మంత్రులతో కలిసి తిరుగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.






Leave a Reply