NewsInn

News in a Click

ఆర్టీసీ సమ్మెలో విషాదం – డ్రైవర్ మృతి

(వరంగ‌ల్,న్యూస్ఇన్‌)

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం నెలకొంది. వరంగల్ (D) నర్సంపేటలో ఈ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన RTC డ్రైవర్‌ శంకర్ గౌడ్ చనిపోయారు. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన్ను వరంగల్ MGM నుంచి HYDకు తీసుకొస్తుండగా కర్మాన్‌ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్‌బాగ్ DRDO అపోలో ఆస్ప‌త్రికి శంక‌ర్ గౌడ్ మృత దేహాన్ని త‌ర‌లించారు. అయితే ఆత్మ‌హ‌త్య య‌త్నం ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం స్పందించింది. రేపు మ‌రోసారి మంత్రులు చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని ప్ర‌క‌టించింది. ఆర్టీసి ఉద్యోగులు తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఙ‌ప్తి చేశారు.

మ‌ధ్యాహ్నం ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసుకోవ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. వ‌రంగ‌ల్ ఆసుపత్రిలో చికిత్స కోసం శంక‌ర్ గౌడ్ ను ముందుగా త‌ర‌లించినా మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ త‌ర‌లించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్ చేరుకున్న త‌రువాత ఆసుప‌త్రికి కొద్ది దూరంలోనే శంక‌ర్ గౌడ్ క‌న్ను మూశారు.

స‌చివాలయంలో చ‌ర్చ‌లు…..
మంత్రుల క‌మిటీ శుక్ర‌వారం ఉద‌యం స‌చివాల‌యంలో ఉద‌యం 10 గంట‌ల‌కు ఆర్టీసీ జెఏసీ ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుప‌నుంది. ఆర్టీసి కార్మిక సంఘాలు కోరిన 32 డిమాండ్ల‌లో 29 డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉంద‌ని కేవ‌లం మూడు డిమాండ్ల‌పైనే ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపి నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంద‌ని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో శుక్ర‌వారం నాటి చ‌ర్చ‌ల‌పై ఆస‌క్తి పెరిగింది. మ‌రో వైపు ఆర్టీసి కార్మికుల స‌మ్మె వెనుక హ‌రీష్ రావ్ కుట్ర‌లు అంటూ కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు కూడా వివాదాస్ప‌దం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *