
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందని సంస్థ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని, ప్రాణాల మీదికి తెచ్చుకునేలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమ్మె అంశంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించిందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు చర్చలు…..
ఉద్యోగుల సంక్షేమమే యాజమాన్యం యొక్క ప్రధాన ధ్యేయమని పేర్కొన్న నాగిరెడ్డి గారు సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రక్రియపై పూర్తి నమ్మకంతో ఉండాలని కోరారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం హైదరాబాద్ సెక్రటేరియట్ లో సీనియర్ అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బోర్డు పరిధిలో ఉన్న అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.ఈ చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని, ఈ సమయంలో కార్మికులు సంయమనం పాటించడం ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం జరిగే చర్చల ఫలితాలు ఉద్యోగులందరికీ మేలు చేకూరుస్తాయని, కాబట్టి ఎటువంటి ఆందోళనలకు లోనుకాకుండా శాంతియుతంగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి కోరారు.






Leave a Reply